ఒమిక్రాన్ వేరియంట్ కలవలపెడుతున్న వేళ.. కరోనా కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు మొత్తం 127 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశ వయోజనుల జనాభాలో 50శాతం మందికిపైగా రెండు డోసుల టీకాలు తీసుకున్నారని ప్రకటించింది. అర్హత గల వారిలో 50శాతానికిపైగా వయోజనులు రెండు డోసులు తీసుకోవడం గొప్ప విషయం అని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. కరోనా మహమ్మారిపై పోరులో మనమంతా కలిసే విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
కరోనా కట్టడిలో భాగంగా ఈ ఏడాది జనవరిలో దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. తొలుత కరోనా ఫ్రంట్లైన్ వారియర్స్కు ప్రాధాన్యతనిచ్చి వ్యాక్సినేషన్ చేపట్టారు. ఆ తర్వాత క్రమంగా ప్రజలందరికీ వ్యాక్సిన్ అందించారు. ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నాయి. మార్చి 1 నుంచి 60 ఏళ్లకు పైబడినవారికి తరువాత ఎప్రిల్ 1 నుంచి 45 ఏళ్లకు పైబడిన వారికి కరోనా టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు. మే 1 నుంచి 18 ఏళ్లకు పైబడిన వారందరికీ కోవిడ్ వ్యాక్సినేషన్ మొదలైంది. అక్టోబర్ లో 100కోట్ల వ్యాక్సినేషన్ మైలు రాయిని చేరుకుంది. దేశంలో మొత్తంగా 127.61 కోట్లు డోసుల వ్యాక్సినేషన్ అర్హులైన ప్రజలకు అందించారు.