Thursday, March 28, 2024

ఆఫ్ఘనిస్థాన్ అభివృద్ధికి భారత ప్రభుత్వం నిధులు.. స్వాగ‌తించిన తాలిబ‌న్ ప్ర‌తినిధి

పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ని ఆఫ్ఘనిస్థాన్ లోని తాలిబన్లు మెచ్చుకుంటున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ బాగుందని అంటున్నారు. ఈ బడ్జెట్ లో ఆఫ్ఘనిస్థాన్ కు సాయం ప్రకటించడాన్ని తాలిబన్ పాలకులు స్వాగతించారు. భారత ప్రభుత్వ నిర్ణయంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని చెప్పారు. ఈమేరకు శుక్రవారం తాలిబన్ ప్రతినిధి సుహైల్ షాహీన్ మాట్లాడారు. ఆఫ్ఘనిస్థాన్ అభివృద్ధికి భారత ప్రభుత్వం నిధులు కేటాయించడాన్ని స్వాగతిస్తున్నట్లు షాహీన్ చెప్పారు. మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని అన్నారు.

ఆఫ్ఘనిస్థాన్ అభివృద్ధికి రూ.200 కోట్ల సాయం ప్రకటించారు. అఫ్ఘనిస్థాన్ ప్రజలను ఆదుకునేందుకు, అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు భారత ప్రభుత్వం తరఫున సాయంగా ఈ మొత్తాన్ని అందించనున్నట్లు మంత్రి తెలిపారు. కాగా, 2021లో ఆఫ్ఘనిస్థాన్ ను తాలిబన్లు ఆక్రమించుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ దేశాన్ని తాలిబన్ ప్రభుత్వమే పాలిస్తోంది. ఈ ఆక్రమణ తర్వాత ప్రపంచ దేశాల నుంచి ఆఫ్ఘనిస్థాన్ కు సాయం నిలిచిపోయింది.ఐక్యరాజ్య సమితితో పాటు పలు దేశాలు చేపట్టిన ప్రాజెక్టులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఆఫ్ఘనిస్థాన్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. తాలిబన్ల ఆక్రమణ కారణంగా నిలిచిన ఆయా ప్రాజెక్టులు మళ్లీ మొదలు పెడితే భారత్, ఆఫ్ఘన్ దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని తాలిబన్ ప్రతినిధి ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement