Tuesday, April 23, 2024

స్థిరంగా బంగారం ధరలు.. తగ్గిన వెండి

నేటి బంగారం..వెండి ధరలు ఇలా ఉన్నాయి. బంగారం ధర స్థిరంగా ఉన్నా.. వెండి ధరలు కాస్త తగ్గాయి. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 200 మేర తగ్గుముఖం పట్టింది. దీంతో సిల్వర్ ధర రూ.68 వేలకు పడిపోయింది. అంతకుముందు వరుసగా 3 రోజుల్లో ఏకంగా రూ.1700 మేర రేటు పెరిగింది.అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 1754 డాలర్ల వద్ద ఉంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 21.46 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.81.81 వద్ద ఉంది.

ఇటీవల ఒక దశలో రూ.83 లెవెల్స్‌ను తాకిన రూపాయి విలువ మళ్లీ రూ.80 కి దిగొచ్చినా ఇప్పుడు మెల్లమెల్లగా మళ్లీ పతనం అవుతోంది. యూఎస్ ఫెడ్ ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు.. ఈ ఏడాది వరుసగా నాలుగు సార్లు 75 బేసిస్ పాయింట్ల చొప్పున వడ్డీ రేట్లు పెంచిన విషయం తెలిసిందే. అయితే అక్టోబర్‌లో ద్రవ్యోల్బణం కాస్త తగ్గుముఖం పట్టింది. దీంతో ఫెడ్ ఈసారి వడ్డీ రేట్ల పెంపుపై నెమ్మదించొచ్చని వార్తలొచ్చాయి. అయితే ఫెడ్ గవర్నర్ క్రిస్టోఫర్ దానిని తోసిపుచ్చారు. వడ్డీ రేట్ల పెంపు విషయంలో తగ్గేదే లేదని, కఠినంగానే నిర్ణయాలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు. అలా అయితే వడ్డీ రేట్లు మళ్లీ పెరిగే అవకాశముంది. అప్పుడు డాలర్ విలువ పెరుగుతుంది. దీంతో బాండ్లపై ప్రతిఫలాలు పెరుగుతాయి. ఇక బంగారం, వెండి ధరలు మళ్లీ దిగొస్తాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement