Friday, March 29, 2024

గోదావరి నది ఉగ్రరూపం

తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. పలు జిల్లాల్లో వాగులు వంకలు ఉరకలేస్తున్నాయి. దీంతో ప్రాజెక్టుల్లో భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఇప్పటికే మూసీ నది పూర్తిగా నిండిపోవడంతో ఏడు గేట్లు ఎత్తివేశారు. ఇక, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో నిజామాబాద్‌ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి భారీగా నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టులోకి 1,83,883 క్యూసెక్కుల నీరు వస్తోంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా, ప్రస్తుతం 1082.70 అడుగుల నీటిమట్టం ఉంది. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు. ప్రస్తుతం 60 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

మరోవైపు రెంజల్ మండలం కందకుర్తి వద్ద గోదావరి నది ప్రవాహం ఉగ్రరూపం దాలుస్తోంది. గోదావరి పరవళ్లు తొక్కుతుండ‌టంతో.. కందకుర్తి త్రివేణి సంగ‌మం వద్ద నీటి ప్ర‌వాహం పెరిగింది. గోదావరి నదిలో గల పురాతన శివాలయం నీట మునిగిపోయింది.

హైదరాబాద్ లో భారీ వర్షాలు కురవడంతో హిమాయత్ సాగర్ నిండు కుండలా మారింది. హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువ కావడంతో ఏ క్షణంలోనైనా సాగర్ క్రస్ట్ గేట్ల ఎత్తే అవకాశం ఉంది. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1763 అడుగులు కాగా ప్రస్తుతం 1760.50 అడుగులు ఉంది. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: వరద నీటిలో చిక్కుకున్న ఎమ్మెల్యే కారు

Advertisement

తాజా వార్తలు

Advertisement