Friday, April 19, 2024

గుండెపోటుతో బాలిక మృతి..

మరిపెడ, మార్చి 31(ప్రభ న్యూస్): ఆడుతూ పాడుతూ గడపాల్సిన పసి గుండెకు ఎంత కష్టం వచ్చిందో.. 13 ఏళ్ల పసి హృదయం ఇగ నేను కొట్టుకోను అని ఆగింది.. సాయంత్రం వరకు తోటి మిత్రులతో సరదాగా ఆడిపాడిన బాలిక గుండె హఠాత్తుగా ఆగి తిరిగిరాని లోకాలకు వెళ్ళింది. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే ఆ తల్లిదండ్రులకు గుండెపోటు కడుపుకోత మిగిల్చింది. ఈ హృదయ విధారక ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం అబ్బాయిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని బోడ తండాలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. తండా వాసులు తెలిపిన వివరాల ప్రకారం.. మరిపెడ మండలం బోడతాండకు చెందిన బోడ లకపతి, వసంత దంపతులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు సంతానం.

రెండో సంతానం బోడ స్రవంతి (13) స్థానికంగా ఉన్న ఓ ప్రయివేటు పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. శ్రీరామ నవమి సందర్భంగా పాఠశాలకు సెలవు కావడంతో సాయంత్రం వరకు తాండలో తోటి పిల్లలతో ఆడుకొని నాయనమ్మ వద్ద నిద్రించింది. శుక్రవారం తెల్లవారుజామున ఆయాస పడుతూ నాయనమ్మను లేపింది.. అనంతరం కుప్పకూలింది. తల్లిదండ్రులు నిర్మాణంలో ఉన్న కొత్తింటి వద్ద నిద్రించగా.. అందుబాటులో ఉన్న బాబాయ్ వచ్చి సీపీఆర్ చేసి ఓ ఆర్ ఎంపీ వద్దకు తీసుకెళ్లారు. కానీ అప్పటికే బాలిక మృతిచెందినట్లు వైద్యుడు తెలపడంతో కన్నీటి పర్యంతమయ్యారు. చిన్నారి మృతి విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల వారు తండోపతండాలుగా తరిలివచ్చి బాలిక మృతదేహానికి నివాళి అర్పిస్తున్నారు. ఇంత చిన్న వయస్సులో గుండెపోటుతో మరణించడంతో కుటుంబం శోక సంద్రంలో మునిగింది. ముద్దులొలికే చిన్నారిని చూసి ప్రతి ఒక్కరూ కన్నీటి పర్యంతమయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement