Saturday, April 20, 2024

ప్రజాశాంతి పార్టీలో చేరి షాకిచ్చిన గ‌ద్ద‌ర్.. మునుగోడులో పోటీకి సై అంటున్న యుద్ధనౌక

ప్రజా గాయకుడు గద్దర్ షాకింగ్​ నిర్ణ‌యం తీసుకున్నారు. ప్ర‌జా యుద్ధనౌక‌గా తెలంగాణ‌లో ఎంతో పేరు తెచ్చుకున్న గద్ద‌రన్న పోయి పోయి కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీలో చేరడం ఇప్పుడు సంచనలనంగా మారింది. కేఏ పాల్ స‌మ‌క్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్న గ‌ద్ద‌ర్ వ‌చ్చే నెల‌లో జ‌రిగే మునుగోడు ఉప ఎన్నిక‌ల్లో ప్ర‌జాశాంతి పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. గురువారం నుంచి మునుగోడులో ఇంటింటి ప్రచారం చేయనున్నట్టు గద్దర్​ ప్రకటించారు. మ‌రోవైపు ఈ నెల 2న పీస్ మీటింగ్ కు పోలీసులు అనుమ‌తి నిరాకరించడాన్ని నిరసిస్తూ చేస్తున్న ఆమరణ దీక్షను కేఏ పాల్ విర‌మించారు. ఆయ‌న‌కు గ‌ద్ద‌ర్ నిమ్మ‌స‌రం ఇచ్చి దీక్ష విర‌మింపజేశారు.

కాగా, ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం పోరాటం చేసే గ‌ద్ద‌ర్ త‌న పాట‌ల‌తో తెలంగాణ స‌మాజాన్ని ఎంతో చైత‌న్య ప‌రిచారు. తెలంగాణ ఉద్య‌మంలో సైతం ఆయ‌న పాట‌లు ఎంతో మందిలో స్ఫూర్తిని ర‌గిలించాయి. అయితే, ఆ మ‌ధ్య ఆయ‌న ఆలోచ‌నా విధానంలో మార్పు వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. గ‌తంలో ఎప్పుడూ ఓటు హ‌క్కు వినియోగించుకోని గ‌ద్ద‌ర్ ఈ మ‌ధ్య ఓటు వేశారు. అలాగే, హైద‌రాబాద్ లో జ‌రిగిన న‌రేంద్ర మోదీ బ‌హిరంగ స‌భ‌కు హాజ‌రై అంద‌రినీ ఆశ్చ‌ర్య ప‌రిచారు. ఇక.. గాంధీ భ‌వ‌న్ కు కూడా వెళ్లారు. ఈ క్ర‌మంలో ఆయ‌న కాంగ్రెస్, బీజేపీలో చేరుతార‌ని అనుకుంటే ప్రజాశాంతి పార్టీ వైపు మొగ్గుచూప‌డం ఆశ్చ‌ర్యం కలిగిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement