Friday, April 19, 2024

నైట్ వాచ్ మెన్ నుంచి ఐఐఎం ప్రొఫెసర్.. జర్నీ ఆఫ్ రంజిత్!

పేదరికం నేర్పించే పాఠాలు జీవితంలో కసిని పెంచుతాయి. సాధించాలన్న పట్టుదలను నరనరాన నూరిపోస్తాయి. ఓ యువకుడు నైట్ వాచ్మెన్ స్థాయి నుంచి ప్రతిష్ఠాత్మక ఐఐఎంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయికి ఎదిగాడు. ఆ యువకుడు కేరళకు చెందిన 28 ఏళ్ల రంజిత్ రామచంద్రన్. పేదరికం కారణంగా నైట్ వాచ్ మెన్ గా పనిచేసిన రంజిత్ రామచంద్రన్.. తర్వాత ఐఐటీలో చదివి, ప్రస్తుతం ఐఐఎంలో అసెస్టింట్ ప్రొఫెసర్గా ఉద్యోగం సంపాదించాడు.

కేరళలోని కసర్గఢ్ జిల్లాలో ఓ నిరుపేద గిరిజన కుటుంబంలో రంజిత్ రామచంద్రన్ జన్మించాడు. ఆయన తల్లి నరేగా ఉపాధి కూలీ, తండ్రి టైలర్. టార్ఫాలిన్ కవర్తో కప్పబడిన ఒక చిన్న గుడిసెలో వీరి నివాసం. చిన్నతనం నుంచి వెంటాడుతున్న పేదరికం,దానివల్ల అనుభవిస్తున్న కష్టాలు రామచంద్రన్లో చదువు పట్ల ఏకాగ్రతను పెంచాయి. చదువు మాత్రమే తమ జీవితాలను మారుస్తుందని గ్రహించాడు. అందుకే ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఎదురైనా చదువును వదిలిపెట్టలేదు. స్కూల్లో ఉన్నప్పటి నుంచే ఓ బీఎస్ఎన్ఎల్ టెలీఫోన్ ఎక్స్చేంజ్లో పనిచేస్తూ చదువు కొనసాగించాడు. తనకు మలయాళం మాత్రమే తెలియడం, ఆంగ్లంపై పట్టులేకపోవడంతో అక్కడ ఇబ్బందులను ఎదుర్కొన్నారు. చివరికి పీహెచ్డీ కోర్సు మధ్యలోనే వదిలేసి వచ్చేయాలని భావించారు. కానీ గైడ్ డాక్టర్ సుభాష్ సహకారంతో కోర్సు పూర్తి చేశారు. చివరి రెండు నెలలు బెంగళూరు క్రిస్ట్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేశాడు. ఇటీవలే ఐఐఎం రాంచీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధుల్లో చేరారు.

ఓ చిన్న గుడిసె ఇంటి నుంచి ఐఐఎంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ వరకూ సాగిన తన ప్రయాణాన్ని రంజిత్ ఫేస్ బుక్ ద్వారా పంచుకున్నారు. కూలిపోయే దశలో ఉన్న చిన్న గుడిసె ఫొటోను ఫేస్బుక్లో పోస్ట్ చేసిన రంజిత్.. ఐఐఎం ప్రొఫెసర్ ఇందులోనే పుట్టాడని తెలిపారు. ఏప్రిల్ 9న చేసిన ఈ పో పోస్ట్కు ఫేస్బుక్లో 39 వేల లైక్స్, 11 వేల షేర్లు వచ్చాయి.  తన పోస్ట్కు వచ్చిన స్పందన చూసి రంజిత్ ఆనందం వ్యక్తం చేశాడు. తన జీవిత కథను కొందరైనా స్ఫూర్తిగా తీసుకుంటారనే ఉద్దేశంతో పోస్ట్ చేశానని రంజిత్ తెలిపారు. ప్రతి ఒక్కళ్లూ మంచి లక్ష్యాన్ని పెట్టుకుని తమ కలలను సాధించుకోడానికి పోరాడాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement