Friday, April 19, 2024

ప్రగతి భవన్ వెకిలి చేష్టలు మానుకో: కేసీఆర్ కు ఈటల హెచ్చరిక

తెలంగాణ‌లో నియంతృత్వ పాల‌న కొన‌సాగుతోందని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శనివారం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆ లేఖను అసెంబ్లీ కార్యదర్శికి ఇచ్చారు. అనంతరం సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వం తన కార్యకర్తలను లోపలకి రానీయకుండా నియంతగా వ్యవహరించారని అన్నారు. కేసిఆర్ కనుసన్నుల్లో అధికారులు వ్యవహరిస్తున్నారని, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డిని సైతం లోపలికి రానీయలేదని మండిపడ్డారు. స్వేఛ్చగా తమ అభిప్రాయాలను చెప్పుకునే అసెంబ్లీలో కూడా నాయకుల గొంతు నొక్కే ప్రయత్నం సీఎం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ అసలు రాజ్యాంగం, ఎమ్మెల్యేలు ఎందుకు అనే భావనలో ఉన్నారని పేర్కొన్నారు. ప్రగతి భవన్ వెకిలి చేష్టలు మానుకోకపోతే పరాభవం తప్పదని హెచ్చరించారు.

గడిచిన ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఓటమి లేకుండా ప్రజల్లో ఉన్నానని ఈటల అన్నారు. తెలంగాణ కోసం అసెంబ్లీ వేదికగా ఉమ్మడి రాష్ట్రంలో ప్రశ్నించానని.. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడానని గుర్తు చేశారు. ఇతర పార్టీలలో గెలిచి టీఆర్ఎస్‌లో చేరి చాలామంది మంత్రులు అయ్యారని విమర్శించారు. హుజురాబాద్ లో కురుక్షేత్రం జరగబోతోందన్నారు. టీఆర్ఎస్‌కు ఓటు వేయకపోతే పెన్షన్లు రావని బెదిరిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డానికి తనకు ఇన్నాళ్లు టీఆర్ఎస్ పార్టీ బీఫాం ఇచ్చి ఉండొచ్చు కానీ, తాను గెలుస్తున్న‌ది మాత్రం ప్ర‌జ‌ల మ‌ద్ద‌తుతోనేని స్పష్టం చేశారు. ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెడుతూ టీఆర్ఎస్ గెలుస్తోందని ఈటల వ్యాఖ్యానించారు. మంచి మెజారిటీతో మళ్ళీ గెలిచి వస్తాని ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లోనే కౌశిక్ రెడ్డికి డబ్బులు ఇచ్చి గెలిపించే ప్రయత్నం చేశారని ఈటల ఆరోపించారు.  

కాగా, స్పీక‌ర్ రాజీనామాను ఆమోదించాక హుజూరాబాద్ నియోజ‌క వ‌ర్గానికి ఆరు నెల‌ల్లో ఎన్నిక‌లు నిర్వ‌హించాల్సి ఉంటుంది. ఈటల రాజేందర్ ఈనెల 14న బీజేపీలో చేరేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. ఆయ‌న‌తో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీ రమేష్‌ రాథోడ్ తదితరులు బీజేపీలో చేర‌నున్నారు.

ఇదీ చదవండి: ఏపీలో టెన్త్, ఇంట‌ర్ ప‌రీక్ష‌లు లేనట్లే! మంత్రి కీలక వ్యాఖ్య

Advertisement

తాజా వార్తలు

Advertisement