Thursday, April 18, 2024

TS | సీఎం కేసీఆర్ కృషితో పండుగలా వ్యవసాయం.. రైతు దినోత్సవంలో ఎమ్మెల్సీ కవిత

సీఎం కేసీఆర్ కృష్టితో తెలంగాణలో వ్యవసాయం పండగలా మారిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. వ్యవసాయం అంటే దండుగ అన్న దగ్గరి నుంచి వ్యవసాయం అంటే పండుగ అన్న కాడికి సీఎం కేసీఆర్  తీసుకొచ్చారన్నారు. దేశవ్యాప్తంగా తెలంగాణలో రైతుల అభివృద్ధిపై చర్చ జరుగుతోందన్నారు. గతంలో రైతులంటే చిన్నచూపు ఉండేదని, ఇప్పుడు రైతులు గల్లా ఎగరేసుకునే పరిస్థితికి సీఎం కేసీఆర్ తీసుకొచ్చారని చెప్పారు. రైతులు అప్పులు లేకుండా ఎప్పటికీ చేతిలో డబ్బు ఉండేలా, ఎవరినీ చేయిచాచి అడగవద్దన్న లక్ష్యం కోసం సీఎం కేసీఆర్ ముందుకెళ్తున్నారని స్పష్టం చేశారు. వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్న సీఎం కేసీఆర్​పై రైతుల ఆధరణ ఎప్పటికీ  ఇలానే ఉండాలని కోరారు.

తెలంగాణ  దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సదాశివనగర్ మండలం పద్మాజీవాడలో జరిగిన రైతు దినోత్సవ కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే సురేందర్ తో కలిసి ఆమె పాల్గొని మాట్లాడారు. “తెలంగాణ మోడల్ అంటే ఏంటి అని ఇతర ప్రాంతం నుంచి వచ్చిన మిత్రులు అడిగారు. నదీ జలాలను 610 మీటర్ల పైకి ఎత్తిపోసి పొలాలకు నీళ్లు ఇవ్వడమే తెలంగాణ మోడల్ అని చెప్పాను . ఐదేళ్లలో 65 లక్షల మంది రైతులకు రూ. 65 వేల కోట్లు ఇవ్వడమే తెలంగాణ మోడల్. ప్రతీ రైతుకు రైతు బీమా, ప్రతీ ఎకరాకు నీళ్లు అందించడమే తెలంగాణ మోడల్ అని చెప్పారు. ఆదే తెలంగాణ మోడల్ దేశమంతా విస్తరిస్తుంది” అని కల్వకుంట్ల వ్యాఖ్యానించారు.

తెలంగాణ ప్రజలు సింహాల్లై కొట్లాడి రాష్ట్రం తెచ్చకున్నామని, మొత్తం దేశ రాజకీయ వ్యవస్థ మెడ వంచి రాష్ట్రాన్ని సాధించుకున్నామని స్పష్టం చేశారు. దేశంలో సైనికుల గురించి గొప్పగా మాట్లాడుకుంటామని, ఎండకు వానకు బెదరకుండా దేశానికి రక్షణగా సైనికులు కాపలా ఉంటారని, అదే తరహాలో రైతులు పోలంలో పనిచేస్తూ చెమటచుక్క చిందిస్తారు కాబట్టి ప్రతీ ఒక్కరు కడుపు నిండా అన్నం తినగలుగుతున్నామని అన్నారు. అన్నదాతలకు శిరస్సు వంచి కవిత నమస్కరించారు.

- Advertisement -

ఎల్లారెడ్డి నియోజకవర్గానికి కాళేశ్వరం నీళ్లు

పంట పండించడానికి విత్తనాలు ఉంటే సరిపోదని, సాగునీరు, విద్యుత్తు, పంట కొనే వ్యవస్థ వంటి అనేక సౌకర్యాలు ఉండాలని, కాబట్టి ఈ ప్రతీ అంశం గురించి సీఎం కేసీఆర్ ఆలోచన చేస్తున్నారని వివరించారు. ఒక్క ఎల్లారెడ్డి నియోజకవర్గంలోనే మిషన్ కాకతీయలో భాగంగా 432 చెరువులను బాగు చేసుకున్నామని, దాంతో భూగర్భజలాలు 16 అడగుల పైకి పెరిగాయని గుర్తు చేశారు. 2014లో 3 లక్షల క్వింటాళ్ల ధాన్యం పండితే ఇప్పుడు 5 లక్షల క్వింటాళ్లకు పెరిగిందని చెప్పారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఇది సాధించడానికి ఎంతో శ్రమ చేశామని, ఆలోచన చేశామని, ఆలోచనలను ఆచరణలో పెట్టామని, అందుకే మార్పు వచ్చిందని అన్నారు. చెరువుల మరమ్మత్తుతో పాటు చెక్ డ్యామ్ లను పెద్ద సంఖ్యలో నిర్మించుకున్నామని, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రూ. 60 కోట్ల వ్యయంతో 22 చెక్ డ్యాములను నిర్మించామని వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్యాకేజీ 22తో  ఈ ప్రాంతానికి లక్ష ఎకరాలకు సాగునీరు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 850 కోట్లు మంజూరు చేసిందని, త్వరలో కాలువల పనులు ప్రారంభమవుతాయని ప్రకటించారు.

 

లాభదాయక పంటల వైపు రైతులు మళ్లాలి

రైతు బంధు ఇవ్వగానే అయిపోయిందా అని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తుంటారని, ఆ విషయం సీఎం కేసీఆర్ కు తెలుసు కాబట్టే ఉచిత విద్యుత్తుతో పాటు అనేక రైతు అనుకూల కార్యక్రమాల కోసం వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకుల కళ్లకు కనిపించేలా, చెవులకు వినిపించేలా మనం విషయాలను తెలియజేయాలని సూచించారు. రైతులు సంఘాలుగా ఏర్పడి బలంగా ఉండాలన్న ఉద్ధేశంతో రైతు బంధు సమితి  లను సీఎం కేసీఆర్ ఏర్పాటు చేయించారని గుర్తు చేశారు. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 2600 రైతు వేదికలను నిర్మించారని తెలిపారు. రైతులు అందరూ వరి, పత్తి వంటి పంటలకు మాత్రమే పరిమితం కాకుంటా మరింత లాభదాయకమైన పంటల వైపు మళ్లాలని విజ్ఞప్తి చేశారు.

మన దేశం ఇప్పటికీ ఏటా దాదాపు లక్ష టన్నుల పామ్ ఆయిల్ ను దిగుమతి చేసుకుంటున్నదని, కాబట్టి పామ్ ఆయిల్ వంటి పంటలు సాగు చేసే దిశగా ఆలోచన చేయాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ శాఖను పటిష్టం చేసిన ఎకైక రాష్ట్రం తెలంగాణయేనని అన్నారు. రైతులకు ఏ ఇబ్బంది జరిగినా, పంట నష్టం జరిగినా, రైతు బీమా వంటివి అందకపోయినా ప్రభుత్వానికి వెంటనే తెలియజేయాలని వ్యవసాయ విస్తరణ అధికారులకు కవిత సూచించారు. కార్యక్రమంలో స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి , ఎమ్మెల్యే జాజాల సురేందర్ , కామారెడ్డి జిల్లా బి ఆర్ యస్ పార్టీ అధ్యక్షుడు, ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబుద్దొన్ , టి యస్ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ , కామారెడ్డి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శోభ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement