Friday, April 19, 2024

పుకార్లు, గాలిమాటలు నమ్మొద్దు: రైతులకు మంత్రి గంగుల సూచన

రాష్ట్రంలో ధాన్యం సేకరణ సజావుగా, సంత్రుప్తికరంగా కొనసాగుతుందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేవని, పుకార్లు, గాలిమాటల్ని రైతులు నమ్మెద్దని సూచించారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలు, అందుబాటులోని గన్నీలు, ఇతరత్రా సామాగ్రి, కొనుగోలు చేసిన ధాన్యం వివరాలతో శ్వేత పత్రం విడుదల చేసారు. అసాని తుఫాన్ నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల వద్ద ఏర్పాట్లపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్ 3 వేల కోట్ల నష్టాన్ని భరించి కొనుగోల్లకు ఆదేశాలు జారీ చేసారని మంత్రి గంగుల అన్నారు. గన్నీలు అందుబాటులో లేవని, సౌకర్యాలు లేవని వస్తున్న ఆరోపణల్ని ఖండించారు. 8 కోట్ల 85 లక్షల గన్నీలు ప్రస్థుతం అందుబాటులో ఉన్నాయని ఇందులో ఇప్పటి వరకూ కేవలం  2.5 కోట్ల గన్నీలను మాత్రమే వాడామని చెప్పారు. ఇంకా 6.35 కోట్ల గన్నీలు అందుబాటులో ఉన్నాయన్నారు.  వీటి ద్వారా మరో 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనగలమని చెప్పారు.

అసాని తుఫాన్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, సివిల్ సప్లైస్ శాఖకు చెందిన డీసీఎస్వోలు, డీఎంలు అప్రమత్తంగా ఉండి రైతులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 2,77,866 టార్పాలిన్లు, 11,523 వెయింగ్ మిషన్లు, 11,000 మాయిశ్చర్ మీటర్లు, 4,958 పాడీ క్లీనర్లు అందుబాటులో ఉన్నాయని కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసే ప్రకారం అన్నీ అందుబాటులో ఉంచుతున్నామన్నారు. కొనుగోలు కేంద్రాల్లోకి వచ్చిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని, ఎక్కడైనా స్టోరేజి కొరత ఉన్నచోట లీజుకు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసారు.

రాష్ట్రంలో ఇప్పటి వరకూ 5,774 కొనుగోలు కేంద్రాల్ని ప్రారంభించామని, 28జిల్లాల్లో 3760 కేంద్రాల్లో కొనుగోళ్లు జరుగుతున్నాయన్నారు. మొత్తం 11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామన్నారు. ఇందులో 10 లక్షల మెట్రిక్ టన్నుల్ని మిల్లులకు తరలించామన్నారు. యాసంగి, వానాకాలం ధాన్యం సీఎంఆర్ గడువులోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి గంగుల.

ధాన్యం కొనుగోళ్లపై నిరంతరం అప్రమత్తంగా ఉన్నామని, ఎక్కడా ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకుంటున్నామని చెప్పారు. ఇప్పటివరకూ రైతుల నుండి ఎలాంటి కంప్లైంట్స్ రాలేదన్నారు. ఎవరికైనా ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా 1800 425 00333, 1967 టోల్ ఫ్రీ నెంబర్లను సంప్రదించాలని రైతులకు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement