Thursday, April 25, 2024

నడ్డాతో భేటీ కానున్న ఈటల.. ఇక బీజేపీలో చేరుడేనా!

మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీ చేరడం దాదాపు ఖాయం అయ్యింది. ఈరోజు సాయంత్రం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఈటల భేటీ కానున్నారు. బీజేపీలో చేరికపై జేపీ నడ్డాతో భేటీ కానున్నట్లు సమాచారం. ఈటెల రాజేందర్ తో పాటు ఐదుగురికి జేపీ నడ్డా అపాయింట్మెంట్ ఇచ్చారు. ఈటల వెంట మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి ఢిల్లీ వెళ్లారు. ఈటల ఢిల్లీ టూర్ తో తెలంగాణ రాజ‌కీయాలు ఆస‌క్తిక‌రంగా మారాయి.  నడ్డాతో సమావేశం సందర్భంగా ఈటల కాషాయ కండువా కప్పుకుంటారా..? లేక చర్చలు జరిపి చేరిక ముహూర్తం తరువాత నిర్ణయిస్తారా ? అనేది తేలాల్సి ఉంది. బీజేపీలో చేరాక ఈటల రాజీనామా చేసే అవకాశం ఉంది.

మరోవైపు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో కలిసి ఢిల్లీకి వెళ్లున్నట్లు తెలుస్తోంది. ఈటల చేరికకు ఇప్పటికే బీజేపీ ఆగ్ర నాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపధ్యంలోనే ఆయన హస్తిన బాట పట్టినట్లు తెలుస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ.నడ్డాతోపాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఈటల భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఈటల బీజేపీలో చేరే విషయంలో కీలకంగా వ్యవహరించిన మాజీ ఎంపీ వివేక్‌ కూడా ఢిల్లీ వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది.  

తెలంగాణలో కొన్ని రోజులుగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. భూకబ్జా ఆరోపణలతో ఆయన్ను సీఎం కేసీఆర్‌ మంత్రివర్గం నుంచి తప్పించారు. దీంతో  ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఇది వరకే చెప్పిన ఈటల.. కొత్త పార్టీ పెడతారా? లేదంటే వేరే పార్టీలో చేరతారా? అనేది ఉత్కంఠ రేపింది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ… ఈటల రాజేందర్‌పై దృష్టి సారించింది. పార్టీలోకి రావాల్సిందిగా ఆయనకు ఆహ్వానం అందింది. ఈటల లాంటి నేత తమ బీజేపీలో చేరితే పార్టీకి బలం రావడంతోపాటు.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావడం ఖాయమనే ధీమా కాషాయ నేతల్లో ఉంది.  

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో కలిసి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఈటల రాజేందర్‌కు ఉమ్మడి జిల్లాలో ప్రత్యేక ఫాలోయింగ్‌ ఉంది. ఏ నియోజకవర్గానికి వెళ్లినా  సన్నిహితులు, అభిమానులు ఆయనకు ఉన్నారు. ఈటలను భూకబ్జాల ఆరోపణలతో మంత్రివర్గం నుంచి తొలగించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. హుజూరాబాద్‌తోపాటు కరీంనగర్‌ జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల రాజేందర్‌ వెంట పార్టీ నాయకులెవరూ వెళ్లకుండా బలగాలను మోహరించారు. కరీంనగర్‌ జిల్లాకు చెందిన మంత్రి గంగుల కమలాకర్‌కు హుజూరాబాద్‌ బాధ్యతలను అప్పగించారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి. వినోద్‌కుమార్‌తోపాటు మంత్రి టి.హరీష్‌రావును పర్యవేక్షకులుగా నియమించారు.

టీఆర్‌ఎస్‌ స్థాపించిన తరువాత తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నుంచి కేసీఆర్‌ వెంట నడిచిన కొద్ది మందిలో ఈటల ఒకరు. బీసీ నాయకుడిగా పార్టీలో అనతికాలంలోనే ఎదిగిన ఆయన కేసీఆర్‌కు నమ్మిన వ్యక్తిగా ప్రతి కీలక ఘట్టంలో కొనసాగారు. 2014లో తెలంగాణ సిద్ధించి టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తరువాత ఏర్పాటైన తొలి ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా కీలక మంత్రి పదవిని చేపట్టారు. 2018లో రెండోసారి పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అధినేతతో పెరుగుతూ వచ్చిన దూరం చివరకు మంత్రి పదవి నుంచి తొలగించేంత వరకూ వెళ్లింది. పార్టీతో ఆయనకున్న రెండు దశాబ్దాల అనుబంధం బీటలు వారింది. టీఆర్‌ఎస్‌తో కొంత కాలంగా విభేదిస్తున్న ఈటలను భూకబ్జాల ఆరోపణలతో మంత్రివర్గం నుంచి తొలగించారు.

- Advertisement -

ఇది ఇలా ఉంటే… భూ కబ్జా ఆరోపణలు రావడంతో మంత్రి పదవి నుంచి ఈటలను సీఎం కేసీఆర్ బర్తరఫ్ చేసినప్పటి నుంచి ఈటల కొత్త పార్టీ పెట్టబోతున్నారని ప్రచారం జరిగింది. ఇటీవల శామీర్‌పేట్‌లోని ఈటల నివాసంలో మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, తెలంగాణ జనసమితి అధినేత ప్రొఫెసర్ కోదండరాం ఆయనతో భేటీ అయ్యారు. ఈటల బీజేపీలో చేరతారని ప్రచారం జరగుతున్న నేపథ్యంలో వీరు ఆయనను కలిశారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఐక్య వేదికను ఏర్పాటు చేద్దామని సూచించారు. అయితే, మధ్యలో బీజేపీ, కాంగ్రెస్ నేతలతోనూ భేటీ అయ్యారు. దీంతో ఆయన జాతీయ పార్టీలో చేరుతారనే జోరుగా ప్రచారం జరిగింది. అయితే, దీనిని ఈటల ఖండించారు. మద్దతు కోసమే బీజేపీ, కాంగ్రెస్ నాయకులను కలిసినట్లు వివరించారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త పార్టీ పెట్టడం కంటే.. బీజేపీలో చేరితే బెటర్ అని అనుచరులు ఈటలకు సూచించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ నాయకులకు రహస్యంగా మంతాలు కూడా జరిపారు. ఈటలను బీజేపీలో చేర్చుకునేందుకు పార్టీ జాతీయ నాయకత్వం కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో ఆయన పార్టీలో చేరేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement