Thursday, March 28, 2024

ఈటల సహా బీజేపీలోకి ఐదుగురు నేతలు.. రేపు ఎమ్మెల్యే పదవికి రాజీనామా..?

తెలంగాణ మంత్రివర్గం నుంచి బర్తరప్ అయిన టీఆర్ఎస్ అగ్రనేత ఈటల రాజేందర్ రేపు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నట్టు తెలుస్తోంది. అనంతరం 8 లేదంటే 9వ తేదీల్లో బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని సమాచారం. బీజేపీలో చేరికకు ఇప్పటికే సిద్ధమైన ఈటల.. ఇప్పటికే ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్‌ను, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని కలిసి చర్చించారు.ఈటల, ఏనుగు రవీందర్‌రెడ్డి నేడు హైదరాబాద్ రానున్నారు. భవిష్యత్ కార్యాచరణపై రేపు ప్రకటన ఉంటుందని ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. కాగా, ఈటల, ఏనుగు రవీందర్‌రెడ్డి సహా మొత్తం ఐదుగురు నేతలు కాషాయ కండువా కప్పుకోబోతున్నట్టు సమాచారం.

తనతోపాటు కాషాయ కండువా కప్పుకోబోతున్న ఏనుగు రవీందర్‌రెడ్డి.. తరుణ్ చుగ్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామితో కలిసి బీజేపీ జాతీయ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌తో నిన్న సాయంత్రం భేటీ అయ్యారు. ముందు ఎమ్మెల్యే పదవికి, ఆ తర్వాత టీఆర్ఎస్‌కు ఈటల రాజీనామా చేస్తారని, ఆ తర్వాత మంచి రోజు చూసుకుని బీజేపీలో చేరుతారని సమాచారం. ఈ విషయాన్ని రాజేందర్ స్వయంగా చెప్పినట్టు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement