Tuesday, March 26, 2024

రేషన్ కావాలా..? అయితే ఇది తప్పనిసరి

ఆంధ్రప్రదేశ్ లో ఇకపై రేషన్ బియ్యం కావాలంటే ఈ-కేవైసీ తప్పనిసరి. రేషన్‌ కార్డులో పేర్లు ఉన్న లబ్ధిదారులంతా ఈ-కేవైసీ నమోదు చేసుకోవాల్సిందే. లేదంటే రాబోయే రోజుల్లో వారికి రేషన్‌ బియ్యం, ఇతర నిత్యావసరాలు అందే వీలుండదు. ఒక రేషన్‌ కార్డులో నలుగురు కుటుంబ సభ్యులుంటే.. ఎంతమంది ఈ కేవైసీ చేయించుకుంటే వారికే బియ్యం అందుతాయి. పెద్దలైతే నెలాఖరులోగా ఈ-కేవైసీ నమోదు చేసుకోవాలి. పిల్లలైతే వచ్చే నెలాఖరు వరకు అవకాశం ఉంది. రేషన్ కార్డులో ఎంకమంది పేరు ఉన్నా.. కేవైసీ చేయించుకున్న వారికే బియ్యం అందుతాయి. ఈ మేరకు ఏపీ పౌర సరఫరాలశాఖ స్పష్టం చేసింది.

రాష్ట్రంలో మొత్తం 1.48 కోట్ల రేషన్‌ కార్డుల్లో 4 కోట్ల మందికి పైగా సభ్యులున్నారు. వీరిలో 85 శాతం మంది వివరాలు ఈ-కేవైసీ విధానంలో నమోదయ్యాయి. ఇంకా 35 లక్షల మందికిపైగా నమోదు చేయించుకోవాల్సి ఉంది. అందరి వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలనే కేంద్రం ఆదేశాలతో పౌర సరఫరాలశాఖ దీనిపై దృష్టి పెట్టింది. కార్డులో ఎవరికి ఈ-కేవైసీ కాలేదో వారికి రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో నోటీసులు జారీ చేస్తున్నారు. వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయిస్తున్నారు. ఇందులో పేరున్న వారంతా నెలాఖరులోగా ఈ-కేవైసీ చేయించుకోవాలని స్పష్టం చేస్తున్నారు. దీంతో ఆధార్‌ వేలిముద్రలు పడనివారు మీ-సేవా కేంద్రాలు, తపాలా కార్యాలయాలకు పరుగులు తీస్తున్నారు. అనేక చోట్ల బారులు తీరుతున్నారు. కార్డుల్లో పేర్లున్న అయిదేళ్ల లోపు పిల్లలకూ కొత్తగా నమోదు చేయించి, ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాల్సి వస్తోంది. పెద్దలు ఆగస్టు నెలాఖరులోగా, పిల్లలకైతే సెప్టెంబరు నెలాఖరు లోగా ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి కావాలని పౌర సరఫరాలశాఖ స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండిః తెలుగు రాష్ట్రాలకు రూ.లక్ష జరిమానా విధించిన సుప్రీం కోర్టు

Advertisement

తాజా వార్తలు

Advertisement