Thursday, April 18, 2024

‘డబుల్’​ దందా.. 200 మంది పేద‌ల ద‌గ్గ‌ర‌ 4 కోట్ల వ‌సూళ్లు..

సొంతింటి కల నెర‌వేర్చుకోవాల‌ని ఆశ‌ప‌డేవారే వారికి పెట్టుబ‌డి.. పేద‌ల ఆశ‌లు, ఆకాంక్ష‌ల‌ను ఆస‌రాగా చేసుకుంటున్నారు కొంత‌మంది లీడ‌ర్లు. నిరుపేదల నుంచి భారీగా డబ్బులు దోచుకుని మోసం చేస్తున్నారు. ఇట్లాంటి ఘటన ఒక‌టి ఖమ్మంలో వెలుగులోకి వ‌చ్చింది.

డ‌బుల్ బెడ్రూం ఇండ్ల‌ను ల‌బ్ధిదారుల‌కు ఉచితంగా అందిస్తామ‌ని, ఒక్క పైసా ఎవ‌రికి ఇవ్వొద్దని టీఆర్ ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్‌తో పాటు పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప‌లుమార్లు చెబుతున్నారు. అయినా.. దళారుల మాటలు నమ్మి డబ్బులు ఇచ్చి మోసపోయిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఈ డబుల్​ దందా బయటపడింది. ఖమ్మంలో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు, బ్యాంకు లోన్లు ఇస్తామని ఆశ చూపి సుమారు 200 మంది నుంచి సుమారు 4 కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఇందులో పాత్రదారులు మెప్మా, ఆశ కార్యకర్తలు కాగా.. ప్రధాన సూత్రధారులు మాత్రం అధికార పార్టీకి చెందిన వారిగా బాధితులు చెబుతున్నారు.

ఖమ్మం శివారులోని పుట్టకోటకు చెందిన లక్ష్మీ అనే మెప్మా ఆర్పీ, ఖమ్మం ఖిల్లా బజార్‌కు చెందిన షాహీనా.. నగరంలోని పేదల కాలనీల్లో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు ఇస్తామని.. చెప్పి ఒకొక్కరి దగ్గర 50 వేల నుంచి 2 లక్షల వరకు డబ్బులు వసూలు చేశారు. డబ్బులు కట్టినప్పటి నుంచి ఇప్పుడు, అప్పుడు అంటూ పది నెలలుగా చుట్టూ తిప్పుకుంటున్నారు. ఇన్ని నెలలైనా ఇళ్ల గురించి ఏం చెప్పకపోవటంతో.. వాళ్లపై బాధితులు ఒత్తిడి తీసుకొచ్చారు. ఎలాగోలా వాళ్లను మభ్యపెట్టేందుకు.. డబుల్‌ బెడ్‌ రూం ఇల్లు వచ్చినట్లు నకిలీ పట్టా కాగితాలు చేతికిచ్చి చల్లబరిచారు.

కాగా, అవి నకిలీవని తెలుసుకున్న బాధితులు మంత్రి అజయ్​కుమార్​ దగ్గరికి వెళ్లి అడిగితే.. డబ్బులు తీసుకుని ఇవ్వటమనే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టారు. పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. వెంటనే బాధితులంతా కలిసి.. ఖానాపురం హవేలి పోలీసుస్టేషన్​లో ఫిర్యాదు చేశారు. తమ డబ్బు తమకు ఇప్పించాలని కోరుకుంటున్నారు. బాధితుల్లో కొంత మంది తాము కట్టడమే కాకుండా.. మంచి జరుగుతుందన్న నమ్మకంతో.. బంధువులు, స్నేహితులతో కూడా కట్టించారు.

తీరా.. ఇదంతా మోసమని తెెలియటంతో.. బంధువులు, స్నేహితులంతా ఇంటి మీదకు వచ్చి ఇబ్బందులు పెడుతున్నారని బాధితులు కన్నీటిపర్యంతమవుతున్నారు. మరోవైపు.. బ్యాంకులోన్లు ఇప్పిస్తామని కూడా లక్షలు కట్టించుకోవటంతో ఉన్న డబ్బులు కూడా పోయి ఇప్పుడు తినడానికి ఇబ్బంది పడుతున్నామని లబోదిబోమంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement