Thursday, March 28, 2024

పీసీసీఎఫ్​గా భాధ్యతలు స్వీకరించిన డోబ్రియల్, సీఎం కేసీఆర్​తో మర్యాదపూర్వక భేటీ

తెలంగాణ అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్‌)గా, హెడ్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ ఫోర్స్‌ (హెచ్‌వోఎఫ్‌ఎఫ్‌)గా సీనియర్‌ ఐఎఫ్‌ఎస్‌ అధికారి రాకేశ్‌ మోహన్‌ డోబ్రియల్ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత పీసీసీఎఫ్‌ ఆర్‌.శోభ పదవీ విరమణ చేయగా ఆ స్థానంలో డోబ్రియల్​ని ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం డోబ్రియల్‌ సోషల్‌ ఫారెస్ట్రీ పీసీసీఎఫ్‌ గా, హరితహారం రాష్ట్ర నోడల్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. హరితహారం అమలులో ఆరేళ్లుగా కీలక బాధ్యతలతో పాటు ప్రస్తుత ఉన్నతాధికారుల్లో సీనియర్‌గా ఉండడంతో ప్రభుత్వం డోబ్రియల్‌ను పీసీసీఎఫ్‌గా నియమించింది. ఉత్తరాఖండ్‌కు చెందిన డోబ్రియల్‌ 1987లో ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌లో చేరారు. శిక్షణ తర్వాత 1989లో పాల్వంచ సబ్‌ డీఎఫ్‌ఓగా మొదటి పోస్టింగ్‌ పొందారు. 1991–94 వరకు భద్రాచలం డివిజినల్‌ ఫారెస్ట్‌ అధికారిగా పనిచేశారు. అదే హోదాలో 2002 వరకు వరంగల్, బెల్లంపల్లి డివిజన్లలో పనిచేశారు.

కన్జర్వేటర్‌గా పదోన్నతి పొందాక అదనపు కార్య దర్శి హోదాలో సచివాలయంలో వ్యవసాయ శాఖ, ఉన్నత విద్యాశాఖల్లో డిప్యుటేషన్‌ పై పనిచేశారు. అనంతరం స్పెషల్‌ సెక్రటరీ హోదాలో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా వివిధ యూనివర్సిటీలకు ఇన్‌చార్జి వైస్‌ చాన్స్‌లర్‌గా పనిచేశారు (2003–14). తెలంగాణ ఏర్పడ్డాక 2015లో అదనపు పీసీసీఎఫ్‌ హోదాలో తిరిగి అటవీ శాఖలో చేరి విజిలెన్స్, ఫారెస్ట్‌ ప్రొటెక్షన్‌ విధులు నిర్వహించారు. 2016 నుంచి హరితహారం నోడల్‌ ఆఫీసర్‌ పనిచేస్తున్నారు. 2020లో పీసీసీఎఫ్‌ ర్యాంకు పొందారు. 2025 ఏప్రిల్‌ వరకు ఆయన సర్వీసులో కొనసాగుతారు. పీసీసీఎఫ్‌గా నియమితులైన డోబ్రియల్‌ను అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, స్పెషల్‌ సీఎస్‌ శాంతి కుమారి, పదవీ విరమణ చేసిన పీసీసీఎఫ్‌ ఆర్‌. శోభ అభినందించారు. కాగా, రిటైర్డ్​ అయిన శోభను ప్రభుత్వ సలహాదారుగా (ఫారెస్ట్ అఫైర్స్) నియమించారు సీఎం కేసీఆర్​. ఆదివారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును మర్యాద పూర్వకంగా కలిసి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement