Wednesday, April 24, 2024

టాలీవుడ్ డ్రగ్స్ కేసు: ఈడీ విచారణకు హాజరైన డైరెక్టర్ పూరి

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణ ప్రారంభమైంది. మంగళవారం ఉదయం సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ ఈడీ ఎదుట హాజరయ్యారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో విచారణకు హాజరుకావాలని ఈడీ అధికారులు పూరి జగన్నాథ్​కు ఇది వరకే నోటీసులు జారీ చేశారు. మనీ లాండరింగ్ కింద కేసు నమోదు చేసిన ఈడీ అధికారులు… దానికి సంబంధించిన వివరాలు సేకరించేందుకు పూరి జగన్నాథ్​ను ప్రశ్నించనున్నారు.

డ్రగ్స్ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు ఇప్పటికే సమాచారం సేకరించారు. డ్రగ్ కేసులో ఇప్పటికే సినీ పరిశ్రమకు చెందిన 12 మందిని ఈడీ విచారించనుంది. మనీ లాండరింగ్ చట్టం కింద 12మంది సినీ రంగానికి చెందిన వాళ్లకు ఈడీ నోటీసులు జారీ చేసింది. నేటి నుంచి సెప్టెంబర్ 22వ తేదీ వరకు నిర్దేశించిన తేదీల్లో హాజరు కావాలని సూచించింది. ఈ నేపథ్యంలో ఇవాళ దర్శకుడు పూరి జగన్నాథ్ విచారణకు హాజరైయ్యారు. సెప్టెంబర్ 2వ తేదీన ఛార్మి, 6వ తేదీన రకుల్ ప్రీత్ సింగ్, 8న రానా దగ్గుబాటి, 9న రవితేజ, శ్రీనివాస్, 13న నవదీప్​తో పాటు ఎఫ్ క్లబ్ మేనేజర్, 15న ముమైత్ ఖాన్, 17న తనీష్​, 20న నందు, 22న తరుణ్ ఈడీ అధికారుల ఎదుట హాజరు కావాల్సి ఉంది.

మరోవైపు టాలీవుడ్‌ డ్రగ్స్‌ వ్యవహారంలో గతంలో అరెస్ట్ అయిన నిందితులను ఈడీ వేర్వేరుగా విచారించింది. ముగ్గురి స్టేట్‌మెంట్‌ల ఆధారంగా విచారణను ఈడీ తీవ్ర తరం చేసింది. డ్రగ్స్‌ను ఎలా కొన్నారు ? ఎవరికిచ్చారు ? నగదు లావాదేవీలు ఎలా జరిగాయి ? తదితర కోణాల్లో ప్రశ్నించింది. ఈ కేసులో కీలక నిందితుడు కెల్విన్ స్టేట్మెంట్ ఆధారంగానే సినీ నటులకు నోటీసులు జారీ చేసింది. నిందితుల స్టేట్‌మెంట్‌లను రికార్డు చేసి.. వారి బ్యాంకు లావాదేవీలను పరిశీలించింది. విదేశాల నుంచి డార్క్‌వెబ్‌ ద్వారా డ్రగ్స్‌ కొనుగోలు చేసినట్టు ఈడీ విచారణలో నిందితులు వెల్లడించారు. డ్రగ్స్ తీసుకుని హవాలా రూపంలో డబ్బులు చెల్లించినట్లుగా ముగ్గురు నిందితులు వెల్లడించారు.

మనీ లాండరింగ్ ద్వారా విదేశాలకు డబ్బులు పంపినట్లు కెల్విన్ వివరించాడు. కెల్విన్, పీటర్ , కమింగా బ్యాంకు డీటెయిల్స్ తో పాటు ఆన్ లైన్ లావాదేవీల వివరాలను తెప్పించుకుంది. హైదరాబాద్‌ ఫిల్మ్‌నగర్‌లోని హీరో నవదీప్ కు చెందిన ఎఫ్ క్లబ్ కు పెద్ద మొత్తంలో డ్రగ్స్ సరఫరా చేసినట్లు చెప్పాడు. ఎఫ్ క్లబ్బు మేనేజర్ కూడా ఈడీ నోటిసులు జారీ చేసింది. డ్రగ్స్ ఎవరెవరికి సరఫరా చేశారని విషయాన్ని క్లబ్బు మేనేజర్ ద్వారా ఈడీ తెలుసుకోనుంది.

ఇది కూడా చదవండి: కోరలు చాస్తున్న కరోనా… బయటకొచ్చిన మరో కొత్త రకం వేరియంట్

Advertisement

తాజా వార్తలు

Advertisement