Wednesday, April 24, 2024

సోషల్ మీడియాలో రచ్చ చేయాలే.. సీఎంతో విందు తీస్కోవాలే..

సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేయాలే.. ఆ తర్వాత సీఎం ఇచ్చే విందుకు అవకాశం పొందాలే అని ఆప్ కొత్త తరహా ప్రచారంతో యువతలో ఉత్తేజాన్ని కలిగిస్తోంది.

ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ అసెంబ్లీ ఎన్నికల కోసం ఈరోజు (సోమవారం) డిజిటల్ ప్రచారాన్ని ప్రారంభించింది. తమ ప్రభుత్వం చేసిన మంచి పనుల గురించి సోషల్ మీడియాలో ప్రచారం చేయాలని ఢిల్లీ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రచారం చేసిన వారికి, వీడియోలు వైరల్ అయిన విధానాన్ని బట్టి యాభై మంది ఢిల్లీ వాసులకు ఎన్నికల తర్వాత విందు ఇస్తానని పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వ మంచి పనులపై వీడియోలను అప్‌లోడ్ చేయండి.. మీరు ఎలాంటి ప్రయోజనం పొందారో ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ఫేస్‌బుక్‌లో ప్రజలకు అర్థమయ్యేలా చెప్పండి. అని ఈరోజు “ఏక్ మౌకా కేజ్రీవాల్ కో” (కేజ్రీవాల్‌కి అవకాశం ఇవ్వండి) ప్రచారాన్ని ప్రారంభిస్తూ పిలుపునిచ్చారు.

ఢిల్లీలో ఉచిత కరెంటు, నీరు అందించడం వంటి ఎన్నో మంచి పనులు తమ ప్రభుత్వం చేసిందని కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీలో నడుస్తున్న మొహల్లా క్లినిక్‌లను చూడటానికి ఐక్యరాజ్యసమితి నుండి ప్రజలు వచ్చారు. అమెరికా అధ్యక్షుడి భార్య ఇక్కడ పాఠశాలలను సందర్శించారు. ఢిల్లీకి ఇప్పుడు 24 గంటల కరెంటు వస్తోంది. ఢిల్లీ ప్రజలు మాకు అవకాశం ఇవ్వడం వల్లే ఇదంతా సాధ్యమైంది. అని కేజ్రీవాల్ అన్నారు. ఇలాంటి వీడియోలను షేర్ చేసి వాటిని వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ చేయాలని ఆయన పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు.

పంజాబ్, ఉత్తరప్రదేశ్, గోవా, ఉత్తరాఖండ్‌లలో తమ పార్టీని విస్తరించాలని అరవింద్ కేజ్రీవాల్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. పంజాబ్‌లో అధికార కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాన పోటీదారుగా ఉంది. ధురి నియోజకవర్గం నుంచి ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ మాన్‌ను బరిలోకి దింపింది. ఫిబ్రవరి 10 నుంచి ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లోని మొత్తం 403 స్థానాల్లో ఆప్ పార్టీ కూడా పోటీ చేస్తోంది. గోవా ఎన్నికల ప్రచారంలో భాగంగా అవినీతి, నిరుద్యోగాన్ని సమస్యలను ప్రధానంగా ప్రస్తావిస్తోంది ఆప్ పార్టీ. గోవా మాజీ ముఖ్యమంత్రి దివంగత మనోహర్ పారికర్ కుమారుడికి బీజేపీ టిక్కెట్ నిరాకరించడం వంటి వాటిని ప్రస్తావిస్తూ బీజేపీపై దూకుడుగా ప్రచారం చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement