Saturday, March 23, 2024

కర్నాట‌క ఎన్నిక‌ల ప్ర‌చారంలో డికె అరుణ‌, సీత‌క్క …

హైదరాబాద్‌,ఆంధ్రప్రభ: త్వరలో జరగనున్న కర్ణాటక ఎన్నికల్లో తమ పార్టీల తరపున తెలంగాణకు చెందిన మహిళా నేతలు డీకే అరుణ, సీతక్క తమదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. బీజేపీ జాతీయ ఉపాధ్య క్షురాలిగా ఉన్న డీకే అరుణ, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క కర్ణాటకలోని తెలుగు ప్రజలు అత్యధికంగా ఉన్న జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లిd సెగ్మెంట్లు ఉన్నాయి. వాటిలో  మెజారిటీ స్థానాలలో తమ అభ్యర్థుల గెలుపు కోసం అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీలు హోరా హోరీగా ప్రచారం చేస్తున్నాయి. ఎవరికి వారు తమదే పైచేయి అన్నట్లుగా ఈ పార్టీల ప్రచారం సాగుతోంది. జనతాదళ్‌ (సెక్యులర్‌ ) పార్టీ కూడా తన ప్రచారాన్ని ముమ్మరం చేసింది. తమ ప్రచారంలో స్థానిక నాయకులతోనే గాక పీఠాధిపతులు, స్వామీజీలు, కుల సంఘాల నేతలతో ప్రచారం చేసుకోవడం మామూలు గా జరుగుతుంది.

కర్ణాటకలో తెలుగు, తమిళం, మళయాళం మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ఆ రాష్ట్రాలకు చెందిన నేతలను పిలిపిం చి ప్రచారం చేయించుకుంటున్నారు. ఆ క్రమంలోనే తెలుగు మాట్లాడే వారి ఓట్లు రాబట్టుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు తెలంగాణకు చెందిన మహిళా నేతలను ప్రచారానికి దింపాయి. బీజేపీ నేత డీకే అరుణ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉండ డంతో పాటు ఆ పార్టీ కర్ణాటక ఉప ఇన్‌చార్జీగా కూడా ఉన్నారు. బీజేపీని గెలిపించాలని గత నెలరోజులుగా కర్ణాటకలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. బళ్లారి, రాయచూరు జిల్లాల్లోని చాలా ప్రాంతాలలో జరిగిన బహిరంగ సభలు, సమావేశాల్లో ఆమె ఇప్పటికే పాల్గొన్నారు. బీజేపీ విధానాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలనువివరిస్తూ బీజేపీని గెలిపించాలని ప్రచారంచేస్తున్నారు. కర్ణాటక సీఎం బసవరాజ్‌ సోమప్ప బొమ్మై, కేంద్ర మంత్రులు పాల్గొన్న పలు బహిరంగ సభల్లో కూడా ఆమె పాల్గొన్నారు. ర్యాలీలు, స్ట్రీట్‌ కార్నర్‌ మీటింగుల్లో కూడా ప్రచారం చేస్తున్నారు. అత్యవసరమైన కార్యక్రమాలు తెలంగాణలో ఉంటే పాల్గొని మళ్లిd కర్ణాటక వెళుతున్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ నాయకత్వమే తమ పార్టీని కర్ణాటకలో గెలిపిస్తుందన్న ధీమాతో డీకే అరుణ ఉన్నారు.

అదే విధంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అనసూయ అలియాస్‌ సీతక్క కూడా తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆమె కూడా తెలుగువాళ్లు అధికంగా ఉన్న రాయచూరు, బళ్లారి, గుల్బర్గా, బీదర్‌ ప్రాంతాలలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ ఆదేశించింది. ఈ మేరకు తన ప్రచారాన్ని తనదైన శైలిలో నిర్వహిస్తూ కాంగ్రెస్‌ అభ్య ర్థులను గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు. ఏఐ సీసీ తెలంగాణ ఇన్‌చార్జీ కార్యదర్శి బోసురాజు సొంత జిల్లా రాయచూరు కావడంతో ఆయనతో పాటు పలు నియోజకవర్గాల్లో ఇప్పటికే ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

అదే విధంగా కర్ణాటక రాష్ట్ర పార్టీ సహాయ కార్యదర్శిగా ఉన్న ఎమ్మెల్యే డి. శ్రీధర్‌ బాబు తో పాటు పలు సెగ్మెంట్లలో పర్యటిస్తూ కాంగ్రెస్‌ అభ్య ర్థుల గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వ వైఫల్యాలు, బీజేపీ మతతత్వ రాజకీయాలను గూర్చి ప్రస్తావిస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వ వైఫల్యాలే తమ పార్టీని గెలిపిస్తాయని ధీమాతో ఉన్నారు. మొత్తం మీద తెలంగాణకు చెందిన ఇద్దరు మహిళా నేతలు చేస్తున్న ప్రచారం అక్కడి తెలుగువాళ్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇరువురి సభలకు పెద్ద సంఖ్యలోనే తెలుగు ప్రజలు పాల్గొంటున్నారు. తమ బిడ్డలంటూ ఇద్దరికి జేజేలు పలుకు తున్నారు. ఇళ్లల్లోకి ఆహ్వానిస్తూ నుదుట తిలకం దిద్ది సత్కరిస్తున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరపున పోటీ చేసే అభ్యర్థుల మొదటి జాబితా 124మందిని ఇప్పటికే ప్రకటించింది. కాబట్టి ఈ సెగ్మెంట్లలో తమ అభ్యర్థులనే గెలిపించాల నే ప్రచారంలో కాంగ్రెస్‌ ముందుంది. బీజేపీ ఇంకా తన అభ్యర్థుల ప్రకటన చేయలేదు. పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ ప్రచారంలో ఉంది. జనతాదళ్‌ (సెక్యులర్‌) పార్టీ అభ్యర్థులు 93 మందిని ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు హెచ్‌డీకుమారస్వామి ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement