Tuesday, March 26, 2024

ఏపీలో కఠినంగా కరోనా ఆంక్షలు.. కర్ఫ్యూ సమయం పెంచే అవకాశం?

ఏపీలో కర్ఫ్యూ విధించినా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. క‌ర్ఫ్యూను కొంద‌రు లైట్ తీసుకుంటున్న‌ట్లు ప్ర‌భుత్వానికి నివేదిక అందడంతో ప్ర‌భుత్వం క‌ఠిన చ‌ర్య‌లు తీసుకునే దిశ‌గా అడుగులు వేస్తుంది. క‌ర్ఫ్యూ స‌మ‌లింపు స‌మ‌యాన్ని ఉద‌యం 6 గంట‌ల నుంచి 9 గంట‌ల‌ వ‌ర‌కు లేదా ఉ. 6 గంటల నుంచి ఉ.10 గంట‌ల వ‌ర‌కు కుదించే విష‌యాన్ని ప‌రిశీలిస్తుంది. సోమ‌వారం అధికారులు, ప‌లువురు మంత్రుల‌తో చ‌ర్చించిన అనంత‌రం సీఎం జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం తీసుకోనున్నారు.

మ‌రోవైపు ఏపీలో పాజిటివిటీ రేటుపై కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి హ‌ర్ష‌వ‌ర్థ‌న్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. పాజిటివిటీ విష‌యంలో ఏపీ దేశంలో 10 వ స్థానంలో ఉంద‌న్నారు. పాజిటివిటీ రేటు పది శాతం దాటితేనే లాక్ డౌన్ విధించాలని ఐసీఎంఆర్‌ సూచిస్తోంది. అలాంటిది ఏపీలో ఇప్పటికే ఈ పాజిటివిటీ రేటు 20 శాతం దగ్గరలో ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా విశాఖ, తూర్పుగోదావరి, అనంతపురం జిల్లాలలో పరిస్థితులు మరింత ఆందోళనకరంగా ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఏపీ సర్కారు నిర్వహిస్తున్న ఫీవర్ సర్వేలో కరోనా పాజిటివ్‌ రేటు అధికంగా ఉన్న‌ట్లు అధికారులు గుర్తించారు. కఠినంగా కర్ఫ్యూ అమలు చేస్తున్నా పాజిటివ్‌ కేసులు పెరగడంపై ప్రభుత్వం ఆలోచనలో పడింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అన్నీ బంద్ చేస్తున్నారు. అత్యవసరమైన మెడికల్ కు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. వారం నుంచి ఈ నిబంధనలు అమలు అవుతున్నా.. కరోనా మాత్రం కట్టడి కావడం లేదు. దీంతో ప్ర‌భుత్వం క‌ఠిన చ‌ర్య‌ల‌కు న‌డుం బిగించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement