హైదరాబాద్, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీలో ‘ పొత్తుల ‘ కాక చల్లారడం లేదు. వచ్చే అసెంబ్లిd ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మొదటి నుంచి చెబుతున్నారు. ఇదే అంశాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీతో కూడా వరంగల్లో నిర్వహించిన రైతు గర్జన సభలోనూ ప్రకటించారు. అయినప్పటికి కాంగ్రెస్ పార్టీలో పొత్తుల చర్చకు మాత్రం పుల్స్టాప్ పడటం లేదు. ‘ నేను పీసీసీ చీఫ్గా ఉన్నంత కాలం బీఆర్ఎస్తో పొత్తు అనేది ఉండదు ‘ అని రేవంత్రెడ్డి చెప్పారంటే.. కాంగ్రెస్ అధిష్టానం వద్ద ఇంకెవరైనా పొత్తుల అంశాన్ని ప్రస్తానకు తీసుకొస్తున్నారా..? అనే చర్చ జరుగుతోంది. అయితే పార్టీలోని కొందరు సీనియర్లు మాత్రం వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు కలిసి పని చేసినా అభ్యంతరం లేదనే భావనతో ఉన్నారనే చర్చ జరుగుతోంది. దీంతో పార్టీ కేడర్, ప్రజల్లోనూ ఆయోమయం నెలకొంటుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్కు నష్టం చేసి.. బీజేపీకి లాభం చేసేందుకే సీఎం కేసీఆర్ కేసీఆర్ పొత్తుల కుట్ర చేస్తున్నారని రేవంత్రెడ్డి ఆరోపిస్తున్నారు. పొత్తుల చర్చ వల్ల కాంగ్రెస్కు నష్టం జరుగుతుందనే అభిప్రాయంతో ఆ పార్టీ నేతలున్నారు.
ఇటీవలనే మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు కుందురు జానారెడ్డి పొత్తులపై స్పందిం చడం.. ప్రజల నిర్ణయం మేరకే పొత్తులు ఉంటాయని ప్రకటిం చడం.. మంగళవారం టీ పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి పొత్తుల అంశంపై కాస్త ఘాటుగానే స్పందించడంపై పార్టీలో ఇప్పుడు తీవ్ర చర్చగా మారింది. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కూడా రాష్ట్రంలో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాదని, బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసినా ఆశ్చర్యపోవాల్సిందేమి లేదని చేసిన వ్యాఖ్యలు అప్పట్లోనే గందరగోళం కలిగించాయి. రాహుల్గాంధీ లోక్సభ సభ్యత్వం రద్దును సీఎం కేసీఆర్తో పాటు రాష్ట్ర మంత్రులు, బీఆర్ఎస్ పార్టీ నేతలు తీవ్రంగానే ఖండించారు. హస్తిన వేదికగా ఏఐసీసీ నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో విపక్ష పార్టీలతో పాటు బీఆర్ఎస్ ఎంపీలు కూడా పాల్గొని సంఘీభావం వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తోందని, వచ్చే ఎన్నికల్లో బీజేపీని గద్దె దింపేం దుకు విపక్షాలన్ని ఏకం కావాల్సిన అవసరం ఉందని ప్రకటించారు. అప్పటి నుంచే మళ్లిd పొత్తులపైన చర్చలు మొదలైనాయి. అయితే రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండటమే కాకుండా, అధికార బీఆర్ఎస్తో ఢీ అంటే ఢీ అనే విధంగా కార్యక్రమాలు ఉంటున్నాయి. అదే స్థాయిలో బీజేపీ కూడా కార్యక్ర మాలు నిర్వహిస్తోంది. ప్రతి పార్టీకి కేడర్ ఉన్నప్పటికి, ప్రజా వ్యతిరేక ఓటును క్యాచ్ చేసకునేందుకు విపక్ష పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇలాంటి సమయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య వచ్చే ఎన్నికల్లో పొత్తు ఉంటుందని ప్రచారం జరిగితే.. కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోతుందని రేవంత్రెడ్డి వర్గం నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే పార్టీ కేడర్, ప్రజల్లో ఎలాంటి అనుమా నాలు తలెత్తక ముందే పొత్తులు అనేవి ఉండవని రేవంత్రెడ్డి క్లారిటీ ఇచ్చారని ఆయన వర్గం నేతలు చెబుతున్నారు.
కాంగ్రెస్ సీనియర్ల నుంచి మరో వాదన కూడా వినిపిస్తోంది. టీఆర్ఎస్ పార్టీ గతంలో కాంగ్రెస్తో కలిసి పని చేయడమే కాకుండా మంత్రి వర్గంలోనూ భాగస్వామ్యులయ్యారని గుర్తు చేస్తున్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీకి కాంగ్రెస్.. ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడిన పార్టీగా బీఆర్ఎస్కు ప్రజల్లో గుర్తింపు ఉందని చెబుతున్నారు. కేంద్రంలో బీజేపీని అడ్డుకోవాలంటే బీజేపీయేత పార్టీలతో జట్టు కట్టక తప్పదని, అది ఎన్నికల్లోనా..? లేదంటే ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చే సమయంలోనా..? అనేది కొన్ని రోజుల్లో స్పష్టత వస్తుందనే వాదన వినిపిస్తోంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్, వివపక్షాల మధ్యనే గట్టి పోటీ ఉంటుందని, అందుకు తెలంగాణ రాష్ట్రమే ఉదహరణగా చెబుతున్నారు. ఇక్కడ రెండు పార్టీలు బలంగా ఉండటమే కాకుండా అధికారంలోకి తామంటే తాము వస్తామని కూడా ప్రకటించుకుంటు న్నారు. అయినప్పటికి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా ప్రతి నాయకుడు పని చేయాల్సి ఉంటుందని పార్టీకి చెందని ఒక సీనియర్ నేత అభిప్రాయపడ్డారు.