Saturday, April 20, 2024

JUDGEMENT DAY: హుజురాబాద్ ఓట్ల లెక్కింపు షురూ

తెలంగాణలో ఉత్కంఠ రేపుతున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ ప్రారంభమైంది. తొలుత 753 పోస్ట‌ల్ బ్యాలెట్ల ఓట్ల‌ను లెక్కిస్తారు. అనంత‌రం ఈవీఎంల్లోని ఓట్ల‌ను లెక్కించ‌నున్నారు. క‌రీంన‌గ‌ర్‌లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీల్లో ఓట్ల లెక్కింపున‌కు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏడు టేబుళ్ల చొప్పున 2 కేంద్రాల్లో 14 టేబుళ్ల‌పై ఓట్ల‌ను లెక్కించ‌నున్నారు. మొత్తం 22 రౌండ్ల‌లో హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ముగియ‌నుంది. ఒక్కో రౌండ్‌కు 30 నిమిషాల స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంది.

తొలుత హుజూరాబాద్ మండ‌లంలోని గ్రామాల ఓట్ల‌ను లెక్కించ‌నున్నారు. ఆ త‌ర్వాత వీణ‌వంక‌, జ‌మ్మికుంట‌, ఇల్లంద‌కుంట‌, క‌మ‌లాపూర్ మండ‌లాల‌ ఓట్ల లెక్కింపు జ‌ర‌గ‌నుంది. మొద‌ట పోతిరెడ్డిపేట‌, ఆఖ‌రున శంభునిప‌ల్లి ఓట్ల‌ను లెక్కించ‌నున్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వ‌ద్ద మూడంచెల భ‌ద్ర‌త ఏర్పాటు చేశారు. 144 సెక్ష‌న్ అమ‌లు చేస్తున్నారు. ఉద‌యం 9:30 గంట‌ల‌కు తొలి రౌండ్ ఫ‌లితం వ‌చ్చే అవ‌కాశం ఉంది. సాయంత్రం 4 గంట‌ల‌కు తుది ఫ‌లితం వ‌చ్చే అవ‌కాశం ఉంది.

మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజురాబాద్ ఉపఎన్నిక అనివార్యమైంది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో మొత్తం 30 మంది అభ్య‌ర్థులు పోటీలో నిలిచారు. టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాద‌వ్, బీజేపీ నుంచి ఈట‌ల రాజేంద‌ర్, కాంగ్రెస్ నుంచి బ‌ల్మూరి వెంక‌ట్ పోటీ చేశారు. ప్రధానంగా బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య పోటీ జరిగింది. ఉపఎన్నిక ఫలితాలపై అన్ని పార్టీలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement