Wednesday, April 24, 2024

కరోనా అంటకుండదంటే ఆటో ప్రయాణమే ది బెస్ట్..

కరోనా విజృంభిస్తున్న వేళ తప్పనిసరి ప్రయాణాలు చేసే వారికి ఇది కొంత ఊరటనిచ్చే వార్తే. బస్సు, ఏసీ, నాన్ ఏసీ కార్లలో ప్రయాణం కంటే ఆటో ప్రయాణమే సేఫ్ అని తాజా అధ్యయనంలో తేలింది. ‘కొవిడ్-19 మహమ్మారి వేళ భారత్‌లో వివిధ రవాణా వాహనాల్లో ప్రయాణ.. ప్రమాద విశ్లేషణ’ పేరుతో అమెరికాలోని జాన్ హాప్‌కిన్స్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని వెల్లడించారు. కొవిడ్ రోగితో కలిసి ఆటోలో ప్రయాణించడంతో పోలిస్తే నాన్ ఏసీ కారులో కొవిడ్ రోగితో కలిసి ప్రయాణిస్తే వచ్చే ముప్పు 86 రెట్లు అధికమని, అదే ఏసీ కారులో అయితే ఇది ఏకంగా 300 రెట్లు ఎక్కువగా ఉంటుందని అధ్యయనంలో తేలింది. నాన్ ఏసీ కారులో ప్రయాణిస్తున్నప్పుడు అద్దాలు కిందికి దింపితే ఈ రిస్క్ 250 శాతం తగ్గుతుందని పరిశోధకులు గుర్తించారు.

మనం ప్రయాణిస్తున్న వాహనాల్లో తోటి ప్రయాణికుల్లో ఎవరికైనా కరోనా సోకి ఉంటే.. ఆటోలో కంటే ఏసీ కారులో ప్రయాణిస్తున్నప్పుడు వైరస్ మనకు సంక్రమించే ప్రమాదం 300 రెట్లు అధికంగా ఉంటుందని తేలింది. ఆటో, కార్లలో ఐదేసి మందిని, బస్సులో డ్రైవర్ సహా 40 మందిని ఈ అధ్యయనానికి ప్రాతిపదికగా తీసుకున్నారు. ఆటోలో నలుగురితో కలిసి ప్రయాణించేటప్పుడు కలిగే ముప్పుతో పోలిస్తే ఆగి వున్న బస్సులో కిటికీలన్నీ తెరిచి ఉంచి, అందులో 40 మంది ప్రయాణికులు ఉన్నప్పుడు వైరస్ ముప్పు 72 రెట్లు అధికంగా ఉంటుందని అధ్యయనంలో వెల్లడైంది. ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలు ‘ఎన్విరాన్‌మెంటల్ రీసెర్చ్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి

Advertisement

తాజా వార్తలు

Advertisement