Wednesday, April 24, 2024

మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డిపై రేవంత్‌రెడ్డి సంచలన ఆరోపణలు

హైదరాబాద్ నగరానికి సమీపంలోని దేవరయాంజిల్‌లో రామాలయ భూముల్లో మంత్రి కేటీఆర్‌కు కూడా భూములున్నాయని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ భూముల విషయమై సీబీఐ విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేటీఆర్ పేరున ఉన్న సేల్ డీడ్‌ను రేవంత్ రెడ్డి మీడియాకు విడుదల చేశారు. ఈ గ్రామంలో దేవుడి మాన్యాల్లో టీఆర్ఎస్ నేతలకు భూములున్నాయన్నారు. ఆన్‌లైన్ లో దేవరయంజాల్ లో భూములు లేవన్నారు. సర్వే నెంబర్ 658లోని భూమిని మంత్రి మల్లారెడ్డి ఆక్రమించుకొన్నారని ఆయన ఆరోపించారు. ఏడు ఎకరాల్లో మంత్రి మల్లారెడ్డి ఫామ్‌హౌజ్‌ను కట్టుకొన్నారన్నారు. రామాలయానికి చెందిన 1553 ఎకరాల్లో కేటీఆర్‌కు, నమస్తే తెలంగాణ సీఎండీ దామోదర్ రావుకి భూమి ఉందన్నారు.

ఈ భూముల్లో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను కూలగొట్టాలని ఆయన డిమాండ్ చేశారు. సర్వే నెంబర్ 437లో ఉన్న అక్రమ నిర్మాణాల్లో కేసీఆర్‌కు కూడా వాటా ఉందన్నారు. 1925 నుండి 2021 వరకు అన్ని సర్వే నెంబర్ల వివరాలను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కేటీఆర్‌కు భూమిని ఎవరు అమ్మిందో బయటపెట్టాలని ఆయన కోరారు. ఆన్‌లైన్‌లో రంగారెడ్డి జిల్లాకు చెందిన దేవాలయ భూములు ఎందుకు మాయం అయ్యాయని ప్రశ్నించారు. ధరణిని అడ్డుపెట్టుకొని సర్వే నెంబర్లను గోల్‌మాల్ చేశారన్నారు. ఈ విషయమై తాను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తానని చెప్పారు. అయితే కరోనా నేపథ్యంలో తాను ఢిల్లీకి వెళ్లడానికి కొంత ఇబ్బందులున్నాయన్నారు. అయితే అమిత్ షా ను కలవడానికి ముందే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేస్తానన్నారు. దేవరయంజాల్ భూముల లావాదేవీలపై సీబీఐతో విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ గ్రామంలో దేవుడి మాన్యాల్లో టీఆర్ఎస్ నేతలకు కూడా భూములున్నాయన్నారు. తప్పుడు పత్రాలతో కొందరు నేతలు బ్యాంకుల నుండి రుణాలు తీసుకొన్నారని ఆయన తెలిపారు. ఈ విచారణ పూర్తయ్యేవరకు కేటీఆర్‌ను, మల్లారెడ్డిని కూడ మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ భూముల విషయంలో ప్రజాసంఘాలు, పార్టీలు, సంఘాలతో నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement