Thursday, April 18, 2024

గాంధీ భవన్‌లో కాంగ్రెస్ నేతల సత్యాగ్రహ దీక్ష

తెలంగాణలో పేదలందరికీ ఉచితంగా కరోనా, బ్లాక్ ఫంగస్ వైద్యం అందించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ గాంధీ భవన్‌లో కాంగ్రెస్ నేతలు సత్యాగ్రహ దీక్షకు దిగారు. ఈ సత్యాగ్రహ దీక్షరు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి ప్రారంభించారు. ఈ దీక్షలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు వంశీచంద్ రెడ్డి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, యూత్ అధ్యక్షుడు శివసేనారెడ్డి, ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు వెంకట్, కాంగ్రెస్ నేతలు మర్రి శశిధర్ రెడ్డి, కోదండ రెడ్డి, మల్లు రవి, బొల్లు కిషన్, నగేష్ ముదిరాజ్, ఆడమ్ సంతోష్, ఫిరోజ్ ఖాన్, వినోద్ రెడ్డి, ఉజ్మ షాకిర్ నిరంజన్, సోహైల్, సునీత రావ్, నూతి శ్రీకాంత్ మెట్టు సాయి తదితరులు పాల్గొన్నారు.

కాగా దేశంలోనూ, రాష్ట్రంలో కరోనా, బ్లాక్ ఫంగస్ విజృంభిస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని అరికట్టడంలో పూర్తిగా విఫలం అయ్యాయని ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆరోపించారు. వైద్యం కోసం పేదలు ఆస్తులను అమ్ముకోవాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. పేదలకు ఉచితంగా వైద్యం అందించాలని, ఆరోగ్యశ్రీలో కరోనా, బ్లాక్ ఫంగస్‌ను చేర్చి పేదరోగులకు ఎలాంటి ఖర్చు లేకుండా చికిత్సలు చేయాలన్నారు. రాష్ట్రంలో కరోనా ఒక భయంకర పరిస్థితులను కల్పించిందని… ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రజల పాలిట శాపంగా మారిందని దుయ్యబట్టారు. ప్రభుత్వం వెంటనే కరోనా, బ్లాక్ ఫంగస్‌కు ఉచితంగా వైద్యం అందించాలని డిమాండ్ చేస్తూ శాంతి యుతంగా సత్యాగ్రహం చేస్తున్నామన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పేదలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement