Thursday, April 18, 2024

కృష్ణా, గోదావరి బోర్డుల గెజిట్‌పై డైలాగ్ వార్

తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని ప్రాజెక్టులన్నీ కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిలోకి రానున్నాయి. ఇందుకు సంబంధించిన గెజిట్ల‌ను కేంద్రం విడదల చేయడంతో తెలంగాణ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఏపీ సీఎం జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరూ ప్రధాని మోదీ తమ్ముళ్లే అని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. నీటి పంచాయితీ వెనుక రాజకీయ కుట్ర ఉందన్నారు. కేసీఆర్, జగన్ నీటి గొడవ పెద్ద డ్రామా అని పేర్కొన్నారు. జగన్, కేసీఆర్, షర్మిల, విజయమ్మ, బీజేపీ ఎవరి డ్రామా వారు ఆడుతున్నారని విమర్శించారు. తెలంగాణకు అన్యాయం జరిగితే ఊరుకోం అని స్పష్టం చేవారు.

కృష్ణానదిలో తెలంగాణ వాటా తెలంగాణకు ఇవ్వాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ డ్రామాలాడడం మానుకోవాలన్నారు. బోర్డులకు అధికారం ఇవ్వడం అన్యాయం అని అన్నారు. చర్చలతో పరిష్కరించుకోకుండా సీఎంలు వివాదం చేయడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు.

కేంద్ర ప్రభుత్వం గెజిట్ జారీ చేయడంపై తెలంగాణ సీఎం కేసీఆర్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. కేంద్రం గెజిట్ ఇవ్వడంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సరికాదని టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి.

మరోవైపు ఈ విషయంపై దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పందించారు. తెలంగాణకు ఎప్పటికీ అన్యాయం జరగదన్నారు. రెండు రాష్ట్రాలు పెద్దన్న పాత్ర పోషించాలని కేంద్రాన్ని కోరడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ఇరు రాష్ట్రాలకు సమన్యాయం చేసేందుకే గెజిట్ ను విడుదల చేశారని తెలిపారు. ఇది నీటి వాటాలకు సంబంధించింది కాదని, జల వివాదాన్ని పరిష్కరించేందుకే గెజిట్ అని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిపై గెజిట్లు విడుదల

Advertisement

తాజా వార్తలు

Advertisement