Friday, April 19, 2024

పెండింగ్ బకాయిలు విడుదల చేయండి: జగన్ విజ్ఞప్తి

ఢిల్లీలోని రైల్ భవనలో కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌తో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ భేటీ అయ్యారు. రాష్ట్ర సివిల్ సప్లైకు రావాల్సిన బకాయిలు విడుదల చేయాలని పీయూష్ గోయల్‌ను కోరారు.  2020-21 రబీ సీజన్‌కు ధాన్యం కొనుగోలు చేస్తున్నామని, సకాలంలో రైతులకు చెల్లింపులు అందేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రబీ ధాన్యం సేకరణ చురుగ్గా సాగుతుందని, బకాయిలు విడుదల అత్యంత అవసరమని తెలిపారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా బియ్యం సబ్సిడీ బకాయిలు చెల్లించాలని, కేంద్రం నుంచి రావాల్సిన రూ.3,229 కోట్ల బకాయిలు విడుదల చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. 

మరో రెండు నెలలపాటు ఉచితంగా బియ్యం పంపిణీని కేంద్రం పొడిగించినందుకు సీఎం ధన్యవాదాలు తెలిపారు. 2015 డిసెంబర్ వరకు జాతీయ ఆహార భద్రత చట్టం కింద ఏపీలో 1.29 కోట్ల రేషన్‌కార్డుదారులకు ప్రతినెల బియ్యం కేటాయిస్తున్నారని, 2015 డిసెంబర్ తర్వాత 2011 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకుని గ్రామీణ ప్రాంతాల్లో 60.96% కుటుంబాలకు, పట్టణాల్లో 41.14% కుటుంబాలకు మాత్రమే పరిమితం చేసి బియ్యం ఇచ్చేలా సూత్రాన్ని అమలు చేస్తున్నారని పీయూష్‌ గోయల్‌కు తెలిపారు. దీని వల్ల రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని సీఎం జగన్‌ తెలిపారు. 

కర్ణాటకలో రూరల్‌లో 76.04శాతం, అర్బన్‌లో 49.36శాతం, గుజరాత్‌లో రూరల్‌లో  76.64శాతం,  అర్బన్‌లో 48.25శాతం, మహారాష్ట్రలో రూరల్‌లో 76.32శాతం, అర్బన్‌లో 45.34శాతం, కుటుంబాల ప్రాతిపదికిన వారికి బియ్యం కేటాయిస్తున్నారని, ఆంధ్రప్రదేశ్‌ కన్నా ఆయా రాష్ట్రాలు ఆర్థికంగా బాగా అభివృద్ది చెందాయని సీఎం వివరించారు. ప్రస్తుతం రేషన్‌ బియ్యాన్ని కేటాయిస్తున్న ప్రాతిపదిక కూడా, రాష్ట్ర విభజనకు ముందు నిర్ణయించినదని, తెలంగాణకు, ఏపీ మధ్య ఎలాంటి వ్యత్యాసం లేకుండా అదే ప్రాతిపదికన బియ్యాన్ని కేటాయిస్తున్నారని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

రేషన్‌కార్డులకు అర్హులైన వారిని గుర్తించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అంటూ గతంలో సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం నివేదించిందని, పారదర్శక పద్ధతిలో రాష్ట్రంలో ఇంటింటా సర్వే జరిపి 1.47 కోట్ల రేషన్‌కార్డు దారులు జాతీయ ఆహార భద్రత చట్టం కింద అమలు చేస్తున్న కార్యక్రమానికి అర్హులని తెలిపారు. ఈ వివరాలు అన్నింటినీ కూడా డిజిటలైజేషన్‌ కూడా చేశామని చెప్పారు. తర్వాత కూడా జాతీయ ఆహార భద్రతా చట్టం కింద హేతుబద్ధతలేని పరిమితి కారణంగా పేదలు తీవ్రంగా నష్టపోతున్నారని, వీరందరి రేషన్‌భారం రాష్ట్ర ప్రభుత్వం మోస్తోందన్నారు. ఇది రాష్ట్రానికి చాలా భారమని, వెంటనే దీన్ని సరిదిద్దాలని సీఎం కోరారు. కోవిడ్‌ వల్ల రాష్ట్రంలో తలెత్తిన పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఏపీ ప్రభుత్వం చేపట్టిన చర్యలను కేంద్ర మంత్రికి సీఎం జగన్‌  వివరించారు.

ఇదీ చదవండి: తెలంగాణలో విద్యాసంస్థలు ప్రారంభం… క్లాసులు ఎప్పుడుంటే…

Advertisement

తాజా వార్తలు

Advertisement