కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ పార్టీ మరోసారి పోరాటానికి సిద్ధం అవుతోంది. పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఈ రోజు పార్టీ ఎంపీలకు కీలక సూచనలు, దిశానిర్దేశం చేయనున్నారు.
టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఆదివారం మధ్యాహ్నం ప్రగతి భవన్లో జరగనుంది. సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముందు లోక్సభ, రాజ్యసభ లో టీఆర్ఎస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహాన్ని ఆయన ఖరారు చేయనున్నారు.
రాష్ట్రంలో అమలు కావాల్సిన పెండింగ్ అంశాలు, కేంద్రం నిధులు సహా పలు అంశాలపై ఎంపీలకు సీఎం కేసీఆర్ కీలక సూచనలు చేయనున్నారు. తెలంగాణ హక్కులను సాధించుకునేందుకు ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహాలను ఎంపీలకు దిశనిర్ధేశం చేయనున్నారు. గత పార్లమెంట్ సమావేశాల్లో వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రాన్ని టీఆర్ఎస్ ఎంపీలు నిలదీశారు. ఇప్పుడు ఎలాంటి వ్యూహాన్ని అసరిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.