Tuesday, April 16, 2024

వైద్యశాఖలో 50 వేల ఉద్యోగాలు.. సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్

కరోనా రోగులకు సేవలు అందించేందుకు తాత్కలిక పద్దతిన పని చేసేందుకు మొత్తం 50వేల మందిని ఉద్యోగాల్లో నియమించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకోసం ఎంబీబీఎస్ పూర్తి చేసిన వైద్యుల నుండి ధరఖాస్తులు ఆహ్వానించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో నెలకొన్న కరోనా పరిస్థితులపై ఆదివారం ప్రగతిభవన్‌లో కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా పనిచేస్తున్న రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి పని ఒత్తిడి తగ్గించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. అందులో భాగంగా రాష్ట్ర వ్య్తాప్తంగా దాదాపు 50 వేల మంది ఎంబీబీఎస్ పూర్తిచేసి సిద్ధంగా ఉన్న అర్హులైన వైద్యుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించాలని నిర్ణయించారు. రెండు, మూడు నెలల కాలానికి డాక్టర్లు, నర్సులు, లాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, ఇతర పారా మెడికల్ సిబ్బందిని తక్షణమే నియమించుకోవాలని, కరోనా వైద్యంలో వారి సేవలను వినియోగించుకోవాలని సీఎం కేసీఆర్ వైద్యాధికారులను ఆదేశించారు. వీరికి గౌరవ ప్రదమైన రీతిలో జీతాలు అందించాలని సూచించారు.

వీరికి భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో వెయిటేజీ మార్కులను కలపాలని సీఎం ఆదేశించారు. కష్టకాలంలో ప్రజల కోసం సేవచేయడానికి ముందుకు రావాలని యువ డాక్టర్లకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించి ఆసక్తి ఉన్నవాళ్లు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సీఎం తెలిపారు. https://odls.telangana.gov.in/medicalrecruitment/Home.aspx.. ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సీఎం పిలుపునిచ్చారు.

మరోవైపు వరంగల్, అదిలాబాద్ జిల్లాల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ను తక్షణమే ప్రారంభించాలని, వైద్య సిబ్బందిని నియమించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. కాకతీయ మెడికల్ కాలేజీ ఆవరణలో నిర్మించిన ఎంజీఎంకు చెందిన 250 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, అదిలాబాద్ జిల్లా రిమ్స్‌ లోని మరో 250 పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖానను తక్షణమే ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. పీఎంఎస్ఎస్‌వై కింద ఎంజీఎంలో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ నిర్మాణానికి ప్రభుత్వ వాటాకింద తక్షణం అందచేయాల్సిన 8 కోట్ల రూపాయలను, రిమ్స్‌ లో ఇదే పథకం కింద నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ దవాఖానకు ప్రభుత్వ వాటాకింద 20 కోట్ల రూపాయలను తక్షణమే విడుదల చేయాలని ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావును ఆదేశించారు. ఇందుకోసం మెత్తం 729 సిబ్బంది నియామకానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement