Friday, April 19, 2024

TS: సీఎం కేసీఆర్ పెద్ద మ‌నుసు.. క‌ర్నాట‌క రైతు కుటుంబానికి 10 ల‌క్ష‌ల ఆర్థిక‌ సాయం

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రైతుల పట్ల తన అభిమానాన్ని, ప్రేమని మరోసారి చాటుకున్నారు. మరణించిన రైతు కుటుంబానికి అండగా నిలిచారు. నేనున్నానంటూ సాయం అందించారు. వివిధ రాష్ట్రాల నుంచి కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శంచడానికి ఇటీవల వచ్చిన జాతీయ రైతు సంఘం కార్యకర్త విమల్ కుమార్ త‌న‌ పర్యటన అనంతరం హైదరాబాద్ లో గుండెపోటుతో చ‌నిపోయారు. ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆయన మృతికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ వారి కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారు. ఆ కుటుంబాన్ని ఆర్థికంగా నిలబెట్టేందుకు 10 లక్షల సాయాన్ని అందించారు.

జాతీయ రైతు సమాఖ్య కర్నాటక రాష్ట్ర అధ్యక్షుడు శాంత కుమార్ అధ్యక్షతన మైసూరులో ఏర్పాటు చేసిన సభలో తెలంగాణ రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆ కుటుంబానికి సాయం అంద‌జేశారు. ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలోని రైతాంగానికి ప్రభుత్వం అందిస్తున్న రైతు బంధు, రైతు భీమా, 24గంటల ఉచిత విద్యుత్ లాంటి పథకాలు రైతులకు ఉపయోగపడుతున్నాయని, వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తున్నాయని తెలిపారు.

తెలంగాణ పథకాల గురించి తెలుసుకున్న కర్ణాటక రైతులు తమ రాష్ట్రంలో కూడా ఇటువంటి పథకాలు కావాలని అమలు చేస్తే బావుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. తదనంతరం 10 లక్షల రూపాయలను విమల్ కుమార్ కుటుంబ సభ్యులకు అందించిన‌ట్టు ప‌ల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో దక్షిణ భారత రైతు సంఘాల అధ్యక్షుడు కోటపాటి నరసింహ నాయుడు, తెలంగాణ రైతు బంధు సమితి ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరావు, చేతన్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement