Wednesday, March 27, 2024

ఐటీ హబ్ గా విశాఖపట్నం… ఉద్యోగాల కల్పనకు కేంద్రం

విశాఖపట్నం అనేది ఉద్యోగాల కల్పనకు ప్రధాన కేంద్రం అవుతుందని ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. ఐటీ పాలసీపై బుధవారం సీఎం సమీక్ష నిర్వహించారు. ఎలక్ట్రానిక్‌ క్లస్టర్స్‌, డిజిటల్‌ లైబ్రరీలపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ..  మన పిల్లలకు మంచిఉద్యోగాలు రావడమే ఐటీ పాలసీ ప్రధాన ఉద్దేశం కావాలి అని అన్నారు. హైఎండ్‌ స్కిల్స్‌ మన పిల్లలకు నేర్పించాలని, హైఎండ్‌ స్కిల్స్‌ నేర్పించే కంపెనీలకు, సంస్థలకు పాలసీలో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వారికి మంచి ప్రోత్సాహకాలను అందించాలన్నారు. దీనివల్ల పిల్లల్లో అంతర్జాతీయ స్థాయిలో పనిలో అనుభవం, నైపుణ్యాలు పెరుగుతాయని తెలిపారు. ప్రపంచ స్థాయితో పోటీపడే పరిస్థితి ఉంటుందని, మంచి ఉద్యోగాలు మన పిల్లలకు వస్తాయని చెప్పారు.

విశాఖపట్నం అనేది ఉద్యోగాల కల్పనకు ప్రధాన కేంద్రం అవుతుందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం కల్పించనున్న మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ విమానాశ్రయం.. ఇవన్నీ కూడా నగరం స్థాయిని మరింతగా పెంచుతాయని చెప్పారు. భవిష్యత్‌లో ఐటీ రంగానికి మంచి కేంద్రంగా మారుతుందని వెల్లడించారు. కాలక్రమేణా ఈ అంశాలన్నీ సానుకూలంగా మారి కంపెనీలకు విశాఖ ఒక ఆకర్షణీయ కేంద్రంగా మారుతుందన్నారు. నాణ్యమైన విద్యకు విశాఖపట్నాన్ని కేంద్రంగా చేయాలని చెప్పారు. నాణ్యమైన విద్య వల్ల మంచి ప్రతిభావంతమైన మానవవనరులు లభిస్తాయని పేర్కొన్నారు.

ఐటీ రంగంలో అత్యుత్తమ యూనివర్శిటీని విశాఖపట్నంలో తీసుకురావాలని సీఎం జగన్ తెలిపారు. ఐటీ రంగంలో అత్యాధునిక టెక్నాలజీ లెర్నింగ్‌కు డెస్టినేషన్‌గా ఈ యూనివర్శిటీ మారాలన్నారు. ఏపీలో ఏర్పాటయ్యే కంపెనీలకు ప్రతి ఏడాది కూడా ఇన్సెంటివ్‌లు చెల్లిస్తామని సీఎం వెల్లడించారు. కనీసం ఏడాది పాటు ఒక ఉద్యోగి స్థిరంగా అదే కంపెనీలో పనిచేయాల్సి ఉంటుందన్నారు. మొదటి ఏడాది పూర్తవగానే ఆ కంపెనీకి ఇన్సెంటివ్‌ల చెల్లింపులు ప్రారంభం అవుతాయని చెప్పారు. ఈ నిబంధన వల్ల మన పిల్లలకు ఏడాదిపాటు స్థిరమైన ఉపాధి లభిస్తుందన్నారు. అంతేకాక నిర్ణీత కాలం పని వల్ల నైపుణ్యం కూడా మెరుగుపడుతుందని అభిప్రాయపడ్డారు.

వర్క్‌ఫ్రం హోం కాన్పెస్ట్‌ను బలోపేతం చేసే చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాలకు మంచి సామర్థ్యం ఉన్న ఇంటర్నెట్‌ను తీసుకెళ్లేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ప్రతి గ్రామ పంచాయతీలో డిజిటల్‌ లైబ్రరీలను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. అక్కడ నుంచే పనిచేసుకునే సదుపాయం ఉంటుందన్న సీఎం జగన్.. డిసెంబర్‌ కల్లా సుమారు 4వేల గ్రామాలకు ఇంటర్నెట్‌ కనెక్టివిటీ ఇచ్చేలా అధికారులు ముందడుగు వేస్తున్నాన్నారు. అదే సమయానికి డిజిటల్‌ లైబ్రరీలు ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. ఈ చర్యలతో గ్రామాలనుంచే వర్క్‌ఫ్రం హోం కాన్సెప్ట్‌ మరింత బలోపేతం అవుతుందని తెలిపారు. అన్ని గ్రామ పంచాయతీల్లో రెండేళ్లలో డిజిటల్‌ లైబ్రరీల ఏర్పాటు పూర్తికావాలని అధికారులను ఆదేశించారు. విశాఖపట్నం, తిరుపతి, అనంతపురంలలో కాన్సెప్ట్‌ సిటీలని సీఎం తెలిపారు. దీనికి అవసరమైన భూములను గుర్తించాలని సూచించారు. కాన్సెప్ట్‌ సిటీల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేయాలి అధికారులకు సీఎం ఆదేశించారు.

కడప సమీపంలోని కొప్పర్తి వద్ద నిర్మిస్తున్న వైయస్సార్‌ ఈఎంసీ ప్రగతిపై ముఖ్యమంత్రికి అధికారులు వివరాలు అందించారు. శరవేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయని వెల్లడించారు. అక్టోబరులో ముఖ్యమంత్రిచే ప్రారంభోత్సవం చేయించేలా ఏర్పాటు చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ సమావేశానికి పరిశ్రమలు,వాణిజ్యం, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్, వైఎస్‌ఆర్‌ ఎలక్ట్రానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌  క్లస్టర్స్‌(ఈఎంసీ) సీఈఓ ఎం.నందకిషోర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement