Thursday, April 25, 2024

థర్డ్‌ వేవ్‌ సన్నద్ధతపై ప్రణాళిక సిద్ధం

ప్రజారోగ్యంపై నిరంతర పరిశీలన, పర్యవేక్షణ ఉండాలని సీఎం వైఎస్ జగన్ అన్నారు. కోవిడ్‌ థర్డ్‌ వేవ్‌ను ఎదుర్కొనేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ మేరకు అధికారులు సీఎం జగన్‌కి తెలిపారు. బుధవారం వైద్య, ఆరోగ్య శాఖలపై సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. కోవిడ్‌ –19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై అధికారులు సీఎం జగన్‌కు వివరాలందించారు. రాష్ట్రంలో శిశు మరణాలను తగ్గించాలని సీఎం అన్నారు.  ఫ్యామిలీ హెల్త్‌ డాక్టర్‌ కాన్సెప్ట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయాలని సూచించారు. కొత్తగా నిర్మిస్తున్న మెడికల్‌ కాలేజీల్లో పీజీ కోర్సులు కూడా ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం.. పారామెడికల్‌ సిబ్బందికీ మెడికల్‌ కాలేజీల్లో శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పబ్లిక్‌ హెల్త్‌ అడ్మినిస్ట్రేషన్‌పై కోర్సులు దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. 

ప్రజారోగ్యంపై నిరంతర పరిశీలన, పర్యవేక్షణ ఉండాలని తెలిపారు. రక్తం, నీరు, గాలి ఈ మూడింటిపైన పరీక్షలు జరగాలన్నారు. విలేజ్‌ క్లినిక్స్‌ స్థాయిలో ఈ పరీక్షలు అందుబాటులో ఉండాలన్నారు. అవసరమైన చోట సీహెచ్‌సీల్లో కూడా డయాలసిస్‌ యూనిట్లు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు. హెల్త్‌ డేటాపై అన్నిరకాల చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడ పరీక్షలు చేయించుకున్నా, ఎక్కడ చికిత్స తీసుకున్నా గుర్తింపు కార్డు ద్వారా ఆ వివరాలతో కూడిన డేటా అప్‌లోడ్‌ చేయాలన్నారు. ఒక వ్యక్తి వైద్యంకోసం ఎక్కడకు వెళ్లినా ఆ వివరాలు డాక్టర్‌కు వెంటనే అందుబాటులోకి వచ్చే విధానం ఉండాలని సూచించారు. దీనికి సంబంధించి మంచి సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం జగన్‌ సూచించారు. 

రాష్ట్రంలో యాక్టివ్‌ కేసులు 14,452 ఉండగా.. రికవరీ రేటు 98.60 శాతంగా ఉందని తెలిపారు. 10,494 సచివాలయాల్లో యాక్టివ్‌ కేసులు నమోదు శాతం జీరో అని అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో 20,964 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్స్‌ అందుబాటులో ఉన్నాయని.. ఇంకా రావాల్సినవి 2493 ఉన్నాయన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆక్సిజన్‌ డి–టైప్‌ సిలిండర్లు 27,311 కాగా.. ఆక్సిజన్‌ పైప్‌లైన్‌ పనులు పూర్తైన ఆస్పత్రులు 108 అని అధికారులు సీఎం జగన్‌కి తెలిపారు.

ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతున్న బెడ్స్‌ 92.50 శాతం ఉండగా.. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందుతున్న బెడ్స్‌ 70.69 శాతం ఉన్నాయన్నారు. 104 కాల్‌ సెంటర్‌కు 684 ఇన్‌కమింగ్‌ కాల్స్‌ మాత్రమే వచ్చాయని తెలిపారు. 18 దఫాలుగా ఇప్పటివరకు ఫీవర్‌ సర్వే పూర్తి చేశామని అధికారులు సీఎం జగన్‌కి తెలిపారు. 50 అంతకంటే ఎక్కువ బెడ్స్‌ ఉన్న ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్లు ఏర్పాటు చేశామని అధికారులు సీఎం జగన్‌కి వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 140 ఆస్పత్రులలో పీఎస్‌ఏ ప్లాంట్లు ఏర్పాటు చేశామని.. అక్టోబరు 6 నాటికి ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్ల ఏర్పాటు పూర్తవుతుందని అధికారులు సీఎం జగన్‌కి తెలిపారు.

థర్డ్‌ వేవ్‌ సమాచారం నేపథ్యంలో కోవిడ్‌ నియంత్రణకు నూతన చికిత్సా విధానాలపై దృష్టి సారించాలన్న సీఎం.. కొత్త మందులు, మెరుగైన ఫలితాలు, తక్కువ దుష్ప్రభావాలు ఉన్నవాటి వినియోగంపై దృష్టిపెట్టి అన్నిరకాలుగా సిద్ధం కావాలని ఆదేశించారు.

- Advertisement -

ఇది కూడా చదవండి: ఏపీ డీజీపీకి చంద్రబాబు లేఖ

Advertisement

తాజా వార్తలు

Advertisement