Wednesday, April 24, 2024

Breaking: సీఎం జగన్ ను కలవనున్న మెగాస్టార్ చిరంజీవి.. సినిమా టికెట్ల వివాదంపై చర్చ!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను మెగాస్టార్ చిరంజీవి భేటీ కానున్నారు. క్యాంపు కార్యాలయంలో సీఎంను చిరంజీవి కలవనున్నారు. సినిమా టికెట్ల విషయంపై సీఎంతో చర్చించనున్నారు. ఈ మేరకు సీఎం అపాయింట్‌మెంట్ ఖరారైంది. ఇద్దరూ కలిసి మధ్యాహ్నం లంచ్ చేయనున్నట్టు తెలుస్తోంది. టికెట్ల వ్యవహారం ముదురుతున్న నేపథ్యంలోనే ఈ సమావేశం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకోనున్న చిరంజీవి.. మధ్యాహ్నం 1 గంట తరువాత సీఎం జగన్ ను కలవనున్నారు.

టాలీవుడ్, ఏపీ ప్రభుత్వం మధ్య సినిమా టిక్కెట్ల ధరల వివాదం కొనసాగుతోంది. టికెట్ల ధరలను జగన్ సర్కార్ తగ్గించడంపై సినీ ఇండస్ట్రీకి చెందిన చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటి చాలా మంది నటులు స్పందించారు. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా ఏపీ ప్రభుత్వంపై ప్రశ్నలను సంధించారు. అంతేకాదు అమరావతికి వెళ్లి మరీ మంత్రి పేర్ని నానితో చర్చించారు. అయినప్పటికీ ఈ వివాదం కొలిక్కి రాలేదు.

మరోవైపు సినిమా వాళ్లు బలిసి కొట్టుకుంటున్నారంటూ వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఆయనకు ప్రముఖ నిర్మాతలు ఎన్వీ ప్రసాద్, తమ్మారెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలో ఈ రోజు సీఎం జగన్‌ను మెగాస్టార్‌ చిరంజీవి కలవనున్నారు. టికెట్ల వివాదం కొనసాగుతున్న వేళ.. సీఎం జగన్‌ను చిరంజీవి కలవడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సినిమా టికెట్ల వివాదం రోజురోజుకు ముదురుతున్న నేపథ్యంలో దీనికి ఫుల్‌స్టాప్ పెట్టాలని చిరంజీవి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్‌ అపాయింట్‌మెంట్ కోరారని సమాచారం. సీఎం జగన్, చిరంజీవి భేటీ తర్వాత సినిమా టికెట్ల వివాదం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement