సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ శుక్రవారం రోజున హైదరాబాద్ రానున్నారు. ఆయన సీజేఐ అయ్యాక తొలిసారి హైదరాబాద్ నగరానికి రానున్నారు. ఎన్వీ రమణకు మంత్రి కేటీఆర్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో స్వాగతం పలకనున్నారు. అనంతరం రాజ్ భవన్లో ఎన్వీ రమణ బస చేయనున్నారు. తెలంగాణ హైకోర్టులో జడ్జీల సంఖ్యను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు జస్టిస్ ఎన్వీ రమణ. తెలంగాణ హైకోర్టులో జడ్జీల సంఖ్యను 24 నుంచి 42కి పెంచారు.
ఇక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ సతీసమేతంగా గురువారం రాత్రి తిరుమల శ్రీవారి ఏకాంతసేవలో పాల్గొన్నారు. శ్రీవారి దర్శనార్థం గురువారం రాత్రి తిరుమల చేరుకున్న ఆయనకు శ్రీ పద్మావతి అతిథిగృహం వద్ద టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి, టీటీడీ ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్రెడ్డి, అదనపు ఈవో ఎ.వి.ధర్మారెడ్డి స్వాగతం పలికారు.అనంతరం శ్రీవారి దర్శనం కోసం ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న జస్టిస్ రమణకు చైర్మన్, ఈవో, అదనపు ఈవో స్వాగతం పలికారు. ఆయన స్వామిని దర్శించుకుని ఏకాంతసేవలో పాల్గొన్నారు.