Friday, April 19, 2024

‘చేనేత మిత్ర’ మా సర్కారు, సబ్సీడీలు ఇస్తున్నాం.. మీరేం చేస్తున్నరో చెప్పాలే: బండికి కేటీఆర్ లేఖ‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : చేనేత కార్మికుల సంక్షేమంపైన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ మాట్లాడిన మాటలు ఆయన అజ్ఞానాన్ని, అమాయకత్వాన్ని, మూర్ఖత్వాన్ని చాటేలా ఉన్నాయని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆదివారం బండిసంజయ్‌కు కేటీఆర్‌ ఒక బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ వర్గాల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ నాయకత్వంలోని తమ ప్రభుత్వం అద్భుతమైన కార్యక్రమాలను చేపట్టి దేశానికి మార్గదర్శిగా నిలుస్తున్నదన్నారు. ఇదే కోవలో దశాబ్దాలుగా నేతన్నల సంక్షేమం కోసం దేశంలో ఏ రాష్ట్రం, ప్రభుత్వం చేపట్టని స్థాయిలో విప్లవాత్మకమైన కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు. దశాబ్దాలుగా అరకొర బడ్జెట్‌ ఇచ్చి నేతన్నల సంక్షేమంపై మొసలి కన్నీరు కార్చిన గత ప్రభుత్వాలకు భిన్నంగా, వందల కోట్ల రూపాయలను ఒకేసారి బడ్జెట్లో కేటాయించి నేతన్నల సంక్షేమానికి సరి కొత్త అర్థాన్ని ఇచ్చామన్నారు.

నేతన్న రుణాలను మాఫీ చేసి వారిని అప్పుల ఊబినుంచి కాపాడమన్నారు. ‘ దేశంలో ఎక్కడా లేని విధంగా చేనేత కార్మికులకు 40 శాతం సబ్సిడీ ఇస్తున్న చేనేత మిత్ర ప్రభుత్వం తెలంగాణలో ఉన్నది. నేతన్నకు చేయూత పేరుతో తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన పొదుపు పథకం తెలంగాణలోని నేతన్నలకు కోవిడ్‌ సంక్షోభ కాలంలో ఒక ఆపన్నహస్తంగా మారింది. మగ్గాల అధునీకరీరణ నుంచి వర్కర్‌ టు ఓనర్‌ పథకం వరకు మా ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాల వలన ప్రస్తుతం రాష్ట్రంలోని నేతన్నల ఆదాయం రెట్టింపై గౌరవంగా వారి కాళ్లపై వారు నిలబడే పరిస్థితి తీసుకు రాగలిగామని గర్వంగా చెప్పగలను. కేవలం నేతన్నలనే కాకుండా స్థూలంగా టెక్స్‌ టైల్‌ పరిశ్రమను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ది చేసేందుకు దేశంలోనే అతిపెద్దదైన కాకతీయ టెక్స్‌ టైల్‌ పార్కు మెదలుకుని అనేక మౌళిక వసతులను కల్పిస్తున్నాం.

చేనేతలతోపాటు పవర్‌లూమ్‌ నేతన్నలకు సైతం పెద్ద ఎత్తున సహాయం అందించిన సర్కారు మాది. ఒకప్పుడు ఉరికొయ్యలకు వేలాడిన నేతన్నల శవాల సాక్షిగా, రాజకీయాలు చేసిన పార్టీల సంస్కృతిని తిరిగి తెలంగాణలోకి బీజేపీ నేతలు తీసుకురావాలనుకుంటున్నారు. ఒకవైపు మా రాష్ట్ర ప్రభుత్వం నేతన్నల సంక్షేమం కోసం చేస్తున్న కార్యక్రమాలను పట్టించుకోకుండా, నేతన్నలను మోసపుచ్చే కల్లబొల్లి మాటలు వల్లె వేస్తున్నారు. మా ప్రభుత్వం చేపట్టిన నేతన్నల సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు అండగా నిలవాల్సిన కేంద్ర ప్రభుత్వం మాత్రం సంపూర్ణ సహాయ నిరాకరణ చేస్తోంది. ఇప్పటికే అనేక సార్లు కేంద్రంలోని మంత్రులను, ప్రధాన మంత్రిని సైతం కలిశాం. కాకతీయ మెగా టె్టక్సల్‌ పార్కుకి ప్రత్యేక ఆర్థిక సహాయం అందించాలన్న మా విజ్ఞప్తిని కేంద్రం పక్కన పెట్టింది. రాష్ట్రంలో నేషనల్‌ టెక్స్‌ టైల్‌ రిసెర్చ్‌ ఇన్ట్సిట్యూట్‌ ఏర్పాటు, చేనేతల కోసం ఒక ఇండియన్‌ ఇన్ట్సిట్యూట్‌ అఫ్‌ హ్యాండ్‌ లూమ్‌ టెక్నాలజీ, మెగాపవర్‌ లూమ్‌ క్లస్టర్‌ ను ఏర్పాటు చేయాలని కోరిన డిమాండ్‌ సైతం కేంద్రం పట్టించుకోవడం లేదని’ కేటీఆర్‌ పేర్కొన్నారు.

‘బండి’ది పాదయాత్ర కాదు ప్రజలపై అబద్ధాల దండయాత్ర..
‘మరోవైపు ప్రజలపై తన అబద్ధాలతో దండయాత్ర చేస్తున్న బండి సంజయ్‌, తన కపట పాదయాత్రలో ఆయన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నేతన్నల కోసం అనేక కార్యక్రమాలు చేపడతామని మాట్లాడుతున్న బండి సంజయ్‌ కేంద్రంలో అధికారంలో ఉన్న విషయాన్ని మర్చిపోయి అవకాశవాదంగా మాట్లాడుతున్నాడు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ పార్లమెంట్‌ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్న బండి సంజయ్‌ ఏనాడైనా తెలంగాణ నేతన్నల సంక్షేమం కోసం వారి భవిష్యత్తు కోసం పార్లమెంట్లో ఒక మాట అయినా మాట్లాడారా.. కాకతీయ మెగా టె్టక్సల్‌ పార్క్‌ కోసం మా ప్రభుత్వం తరఫున అనేక విజ్ఞప్తులు చేసినా, అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వాటిని బుట్టదాఖలు చేసిన అంశంపై ఒక రోజు అయినా నోరు విప్పారా చెప్పాలి. మా ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాల వల్ల వ్యవసాయ రంగంతో పాటు టెక్స్‌టైల్‌ రంగంలోనూ రివర్స్‌ మైగ్రేషన్‌ జరుగుతున్న విషయం బండి సంజయ్‌ కళ్లకు కనిపించకపోవడం ఆయన గుడ్డితనానికి నిదర్శనం. ముంబై, భివండి, సూరత్‌ వంటి ప్రాంతాల నుంచి వేలాది మంది తెలంగాణకు తిరిగివచ్చి ఇక్కడ తమ వృత్తిని ప్రారంభించుకుంటున్న పరిస్థితులు బండి సంజయ్‌కి కనిపించడం లేదా అని మండిప‌డ్డారు.

టెక్స్‌టైల్స్‌పై జీఎస్టీ పన్ను మీ పాపం కాదా..
టెక్స్‌టైల్‌ ఉత్పత్తులపైన భారీగా జీఎస్టీ వాసులు చేస్తూ పరిశ్రమను సంక్షోభంలోకి నెట్టిన దుర్మార్గపు ప్రభుత్వం బిజెపిది కాదా… స్వతంత్ర భారత దేశంలో తొలిసారి చేనేత రంగంపై పన్నులు మోపిన పాపపు ప్రభుత్వం మీదే కదా… ఇదే జీఎస్టీ తగ్గించాలని, చేనేతపైన జీఎస్టీని సంపూర్ణంగా ఎత్తివేయాలని కేంద్రానికి పలుమార్లు లేఖలు రాసి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసిన స్పందించని కేంద్ర ప్రభుత్వం మీదే కదా… మీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉన్న నేతన్నలు, టె్టక్సల్‌ పారిశ్రామిక వర్గాలు ధర్నాలు బంద్‌లు నిర్వ#హంచినా, పన్నులు తగ్గించని, కనికరంలేని కేంద్ర ప్రభుత్వం మీది కాదా. ఒకవైపు కేంద్రంలో అధికారంలో ఉంటూ దేశంలోని నేతన్నల ఉసురు తీస్తూ, పరిశ్రమను సంక్షోభంలోకి నెడుతూ, మరోవైపు పరిశ్రమను ఆదుకునేందుకు శతవిధాలా ప్రయత్నం చేస్తున్న మమ్మల్ని విమర్శించే మీ వైఖరికి ఊసరవెల్లులు సైతం సిగ్గు పడుతున్నాయి. అని మంత్రి కేటీఆర్ త‌న లేఖ‌లో ఘాటుగా చుర‌క‌లంటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement