Sunday, March 24, 2024

ఇరిగేషన్ శాఖపై కేబినేట్ సుదీర్ఘ చ‌ర్చ‌.. ప‌లు ప‌నుల‌కు ఆమోదం..

సిద్ధిపేట జిల్లాలో మల్లన్నసాగర్ జలాశయం నుండి తపాస్ పల్లి జలాశయానికి లింక్ కాలువ తవ్వకానికి రూ.388.20 కోట్లకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తపాస్ పల్లి జలాశయం కింద సిద్దిపేట జిల్లాలో 1,29,630 ఎకరాలకు నికరమైన సాగునీరు అందనున్నది. వనపర్తి జిల్లాలో గోపాల్ పేట మండలం, బుద్దారం గ్రామంలో ఉన్న పెద్దచెరువు పునరుద్దరణ పనులకు రూ.44.71 కోట్లకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మహాత్మాగాంధి కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించ తలపెట్టిన ఘన్ పూర్ బ్రాంచి కాలువ పనులకు 144.43 కోట్లకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ కాలువ ద్వారా ఘన్ పూర్ మరియు అడ్డాకుల మండలాల్లో 25 వేల ఎకరాలకు సాగునీరు అందనున్నది.

ఆదిలాబాద్ జిల్లాలో పెన్ గంగా నదిపై నిర్మాణం అవుతున్న చనాకా కోరాటా బ్యారేజికి సంబంధించి రూ.795.94 కోట్లకు అంచనా వ్యయాన్ని సవరించడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రాజెక్టులో ఇప్పటికే బ్యారేజి నిర్మాణం పూర్తి అయింది, పంప్ హౌజ్ నిర్మాణం కొనసాగుతుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఆదిలాబాద్ జిల్లాలో భీమ్ పూర్, జైనథ్, భేలా, ఆదిలాబాద్ మండలాల్లో 50 వేల ఎకరాలకు సాగు నీరు అందనున్నది. మెదక్ జిల్లాలో నిజాం కాలంలో నిర్మించబడిన ఘన్ పూర్ ఆనకట్ట కాలువల వ్యవస్థను గతంలో ఆధునీకరించడం జరిగింది. అందులో మిగిలిపోయిన మరికొన్ని పనులను చేపట్టడానికి రూ.50.32 కోట్లతో పరిపాలనా అనుమతిని మంత్రివర్గం ఆమోధించింది. ఈ ప్రాజెక్టు కింద మెదక్ జిల్లాలో సుమారు 25 వేల ఎకరాలకు సాగు నీరు అందనున్నది.

వనపర్తి, గద్వాల జిల్లాల్లో 11 చెక్ డ్యాంల నిర్మాణానికి రూ. 27.36 కోట్లతో పరిపాలనా అనుమతిని మంత్రి వర్గం ఆమోధించింది. వనపర్తి జిల్లాలో పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామంలో ఉన్న గోపాల సముద్రం చెరువు పునరుద్ధరణ మరియు సుందరీకరణ పనుల కోసం రూ.10.01 కోట్లు మంజూరు చేస్తూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గద్వాల జిల్లాలో ప్రతిపాదించిన నలసోమనాద్రి గట్టు ఎత్తిపోతల పథకానికి సవరించిన అంచనా వ్యయం రూ.6.69 కోట్లకు అనుమతి, ప్రాజెక్టు పనులకు టెండర్లు పిలవడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

సూర్యాపేట జిల్లాలో చింతలపాలెం మండలం, వెల్లటూరు గ్రామం వద్ద ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ నుంచి నిర్మించ తలపెట్టిన ఎత్తిపోతల పథకానికి, పాల్కేడ్ మండలం గుండెబోయిన గూడెం గ్రామం వద్ద జాన్ పహాడ్ బ్రాంచ్ కెనాల్ నుండి నిర్మించ తలపెట్టిన ఎత్తిపోతల పథకాలకు రూ.16.23 కోట్లకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. సంగారెడ్డి జిల్లాలో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు నిధుల సేకరణకై కంపనీస్ ఆక్ట్(COMPANIES ACT), 2013 ప్రకారం మంజీరా లిఫ్ట్ ఇరిగేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటును మంత్రివర్గం ఆమోధించింది. ఈ కార్పొరేషన్ కు ఇరిగేషన్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ లేదా ప్రిన్సిపల్ సెక్రెటరీ ఛైర్మన్ గా వ్యవహరిస్తారు. ENC (GENRAL), ENC (GAJWEL), ఆర్థిక శాఖ Joint Secretary, ఇరిగేషన్ శాఖ Joint Secretary, సంగారెడ్డి చీఫ్ ఇంజనీర్ డైరెక్టర్లుగా వ్యవహరిస్తారు.

దేవాదుల పథకంలో భాగంగా ఎత్తయిన ప్రాంతాలకు సాగు నీరు అందించడానికి గండి రామారం చెరువు నుంచి కన్నారం చెరువు వరకు పంప్ హౌజ్, కాలువ పనులకు; గుండ్ల సాగర్ నుంచి లౌక్య తండా వరకు పైప్ లైన్ పనులకు; నశ్కల్ జలాశయం వద్ద పంప్ హౌజ్ నిర్మాణానికి మొత్తం రూ. 104.92 కోట్లకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement