Wednesday, April 24, 2024

జనవరి31న కేంద్ర బడ్జెట్ సమావేశాలు.. తొలిసారి ప్రసంగించనున్న ద్రౌపది ముర్ము

జనవరి 31న పార్లమెంట్ లో కేంద్రబడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కాగా బడ్జెట్ సమావేశాల మధ్యలో తాత్కాలిక విరామం తర్వాత ఏప్రిల్ 6వ తేదీన ముగియనున్నాయి. 66 రోజుల కాలంలో 27 సిట్టింగ్‌లు ఉంటాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ రోజు వెల్లడించారు. గతేడాది ఆగస్టులో రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన ద్రౌపది ముర్ము తొలిసారి పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. బడ్జెట్ సమావేశాల తొలి రోజున పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో ఉభయ సభలను ఉద్దేశించి ఆమె ప్రసంగం చేస్తారు. ఈ అమృత కాలంలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, కేంద్ర బడ్జెట్, ఇతర అంశాలపై చర్చలు జరుగుతాయని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ రోజు ట్వీట్ చేశారు.

కేంద్ర బడ్జెట్ రెండు విడతల్లో జరుగుతాయి. తొలి విడత జనవరి 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 14వ తేదీ వరకు జరుగుతుంది. ఇందులో రాష్ట్రపతి ప్రసంగం, ఆమె ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం, దానిపై ప్రధానమంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ల ప్రసంగాలు ఉంటాయి. అనంతరం, బడ్జెట్ పై చర్చ జరుగుతుంది. ఫిబ్రవరి 14వ తేదీ నుంచి మార్చి 12వ తేదీ వరకు తాత్కాలిక విరామం ఉంటుంది. ఈ విరామ సమయంలో ఆయా మంత్రిత్వ శాఖలు సమర్పించిన గ్రాంట్లపై సమగ్ర అధ్యయనం జరుగుతుంది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ గ్రాంట్ల కోసం వచ్చిన డిమాండ్లు, ఇతర నివేదికలను పరీక్షిస్తుంది. అనంతరం, మార్చి 12వ తేదీన రెండో విడత బడ్జెట్ సమావేశాలు మొదలవుతాయి. ఇందులో ఆయా గ్రాంట్లకు ఆమోదం, డిమాండ్లపై చర్చ జరుగుతంది. ఈ విడతలో కేంద్ర బడ్జెట్‌కు ఆమోదం తెలుపుతారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement