Thursday, April 25, 2024

యడియూరప్ప రాజీనామా ?.. ఢిల్లీలో ఏం జరుగుతోంది?

కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుంది. కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప రాజీనామాకు రంగం సిద్ధమైంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సీఎం యడియూరప్ప సమావేశం కావడంతో ఆయన సీఎం పదవికి రాజీనామా చేస్తారంటూ ప్రచారం సాగుతోంది. నిన్న ప్రధాని నరేంద్ర మోడీతో కలిసిన సందర్భంగా రాజీనామాకు అంగీకారం తెలిపినట్లు సమాచారం. కరోనా సమయంలోనూ కొంతమంది మంత్రులు, సొంత పార్టీ ఎమ్మెల్యేలు యడియూరప్పను టార్గెట్‌ చేయడం.. ప్రభుత్వంపై ఆయనపై అసమ్మతి ఎక్కువైంది. ఈ నేపథ్యంలో యడ్డీని సీఎం పదవి నుంచి తప్పించాలని బీజేపీ నాయకత్వం నిర్ణయానికి వచ్చింది.

కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పకు పదవీ గండం పట్టుకుందని కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఆయనపై అసమ్మతి స్వరం వినిపిస్తుండటంతో యడియూరప్ప రాజీనామా చేయక తప్పదన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో యడియూరప్ప ఢిల్లీ పర్యటనకు వెళ్లడంతో ఆ ప్రచారానికి బలం చేకూర్చింది. శుక్రవారం ప్రధాని మోదీతో భేటీ అయిన యడియూరప్ప రాజీనామా గురించే చర్చించినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే విషయంపై శనివారం కేంద్రమంత్రి అమిత్ షా,బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కూడా కలిసి చర్చించనున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు రాజీనామాపై జరుగుతున్న ప్రచారాన్ని సీఎం యడియూరప్ప ఖండించారు. శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన యడ్డీ.. క‌ర్ణాట‌క‌లో సాగునీటి ప్రాజెక్టుల విష‌యంపై చ‌ర్చించేందుకు మాత్రమే తాను ఢిల్లీకి వచ్చానని తెలిపారు. ప్రధానితో భేటీలో కర్ణాటక అభివృద్దిపై చర్చించినట్లు తెలిపారు. తన రాజీనామాపై వస్తున్న వార్తలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement