Friday, March 29, 2024

Crime: బావపై కత్తితో దాడి చేసిన బామ్మర్ది

రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం జరిగింది. కన్నతల్లిని పట్టించుకోకుండా పోషించడం లేదని కూతుర్లు గ్రామపంచాయతీ కార్యాలయంలో పంచాయతీ పెట్టడంతో ఆగ్రహంతో బావపై బామ్మర్ది కత్తితో దాడి చేశాడు. కోనరావుపేట మండలం వట్టి మల్ల గ్రామానికి చెందిన గోసవ్వకు ముగ్గురు కూతుర్లు, ఒక కొడుకు ఉన్నారు. అందరికీ పెళ్లిళ్లు చేసిన గోసవ్వకు వృద్ధాప్యం రాగానే కొడుకు పట్టించుకోక పోవడంతో కూతుర్లు ఆమెను తమ వద్ద ఉంచుకున్నారు. అయితే కన్న కొడుకు సరిగ్గా చూడడం లేడంటూ సోమవారం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద పంచాయతీ పెట్టారు. దీంతో గొసవ్వ కుమారుడైన అంజయ్యను సర్పంచ్ పిలిపించి మందలించారు. దీంతో తనను పంచాయతీకి పిలుస్తారా అంటూ ఆగ్రహం పట్టలేక వరసకు బావైన గంభీరావుపేటకు చెందిన కనకయ్య మీద కత్తితో దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయపడిన కనకయ్యను వెంటనే సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కోనరావుపేట పోలీసులు విచారణ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement