Wednesday, April 24, 2024

బ్రెజిల్ ని ముంచెత్తిన వ‌ర‌ద‌లు – 18మంది మృతి

బ్రెజిల్ దేశాన్ని వ‌ర‌ద‌లు ముంచెత్తాయి.దాంతో ల‌క్ష‌లాది, వేలాది మంది నిరాశ్రుల‌య్యారు. ప‌లు ప‌ట్ట‌ణాలు వ‌ర‌ద‌నీటిలో మునిగిపోయాయి. ప‌లుచోట్ల ఆన‌క‌ట్ట‌లు తెగిపోయాయి. భారీ వ‌ర్షాల‌తో వ‌ర‌ద‌లు రావ‌డంతో బ‌హియా ప్రాంతంలో నివ‌సిస్తున్న 4,30,000మందికి పైగా ప్ర‌జ‌లు ఇక్క‌ట్ల‌కి గుర‌య్యారు. ఈ వ‌ర‌ద‌ల కార‌ణంగా 18మంది ప్రాణాలు కోల్పొయారు. 286మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వ‌ర‌ద‌ల‌కి సంబంధించిన దృశ్యాలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. బ్రెజిల్ మంత్రి జోవా రోమా మీడియాతో మాట్లాడుతూ.. వరదల బాధితులకు సహాయం చేయడానికి దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ 90 మందికి పైగా వైద్యులను బహియాకు మోహరించనుందని తెలిపారు. భారీ వ‌ర్షాల కార‌ణంగా వ‌ర‌ద‌లు పొటెత్తాయి.

ప్ర‌స్తుతం వ‌ర‌ద‌ల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించడానికి, ప్రజలను వారి ఇళ్లపై నుండి, పడవలతో బయటకు తీసుకురావడానికి చ‌ర్య‌ల‌ను ముమ్మ‌రం చేశామ‌న్నారు. బహియా గవర్నర్ రుయి కోస్టా ప్రభావిత ప్రాంతాన్ని సందర్శించారు. ఆహారం, పరుపులు, వెచ్చని దుస్తులు పంపిణీ చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నార‌న్నారు. ప్ర‌స్తుతం కురుస్తున్న భారీ వ‌ర్షాల ధాటికి డ్యాముల్లో భారీగా వ‌ర‌ద నీరు చేరుతోంది. ఈ క్ర‌మంలోనే ఈ నెల 26న‌, ఈశాన్య బ్రెజిల్‌లో రెండు డ్యామ్‌లు దెబ్బ‌తిన్నాయి. డ్యాముల దిగువ ప్రాంతాల్లో వ‌ర‌ద‌లు సంభ‌వించే అవ‌కాశం ఉండ‌టంతో ఇప్పటికే ప్ర‌జ‌లు అక్క‌డి ప్రాంతాల‌ను విడిచి వెళ్లారు. రాబోయే 24 గంటల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అక్క‌డి వాతావ‌ర‌ణ శాఖ పేర్కొంది. ఇప్ప‌టికే అనేక ప్రాంతాలు నీట మునిగి ఉండ‌గా, మ‌ళ్లీ వ‌ర్షాలు ప‌డ‌తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ అంచ‌నాలు ప్ర‌జ‌ల్లో భ‌యాందోళ‌న‌లు పెంచాయి. బహియాలో సుమారు 50 మిల్లీమీటర్ల నుంచి 100 మిల్లీమీటర్ల వరకు కురిసే అవకాశం అధికారులు తెలిపారు. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని బ్రెజిల్ వాతావరణ, ప్రకృతి వైపరీత్యాల పర్యవేక్షణ సంస్థలు హెచ్చరిస్తున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement