Friday, March 29, 2024

బాలుడిపై లైంగిక వేధింపులు .. మ‌హిళ‌పై పోక్సో చట్టం కింద కేసు ..

లైంగిక వేధింపుల‌కి ఆడ‌వారే కాదు మ‌గ‌వారు బ‌లి అవుతున్న కేసులు బ‌య‌టికి వ‌స్తున్నాయి. ఇలాంటి సంఘ‌ట‌న హైద‌రాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. టోలీచౌక్ లో ఉంటున్న ఓ ఫ్యామిలీ జూబ్లీహిల్స్ కు మార‌డంతో ఈ వ్య‌వ‌హారం బ‌య‌ట‌ప‌డింది. అల్మారాలో ఉండాల్సిన 20తులాల బంగాం , న‌గ‌దు క‌నిపించ‌క‌పోవ‌డంతో తొమ్మిద‌వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న బాలుడిని త‌ల్లి నిల‌దీసింది. దాంతో కుమారుడు చెప్పిన స‌మాధానం విని ఆశ్చ‌ర్య‌పోయిందామె. ఆ బంగారం తానే తీశానని, బెంగళూరులో ఉండే తండ్రి బంధువైన యువతికి ఇచ్చినట్టు చెప్పడంతో అందరూ షాకయ్యారు. అసలు ఏం జరిగిందని ప్రశ్నించగా బాలుడు మరిన్ని విస్తుపోయే విషయాలు బయటపెట్టాడు.

తాను చదువుకుంటున్న పాఠశాల వద్దకు వచ్చిన యువతి తనను చార్మినాల్‌లోని లాడ్జ్‌కు తీసుకెళ్లిందని, అక్కడ తనపై లైంగిక దాడికి పాల్పడింద‌ని చెప్పాడు. మాజీ ప్రియుడితో కలిసి దీనిని ఆమె వీడియో తీసిందని, ఆ తర్వాత ఆ వీడియో చూపించి బెదిరించిందని చెప్పాడు. భయపడి మరో గత్యంతరం లేక ఇంట్లోని 20 తులాల బంగారంతోపాటు రూ. 6 లక్షల నగదు ఆమెకు ఇచ్చేశానని వివరించాడు. దీంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కుమారుడిపై మూడుసార్లు అఘాయిత్యానికి పాల్పడిన నిందితురాలిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. కాగా, ఈ ఘటన మూడేళ్ల క్రితం జరిగినట్టు ప్రాథమికంగా గుర్తించిన పోలీసులు నిందితురాలిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ మేర‌కు పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement