Thursday, March 28, 2024

బొంగు చికెన్ వండి.. వడ్డించిన రాహుల్ గాంధీ.. వైరల్ గా వీడియో

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలతో కలిసి బొంగు చికెన్ ని వండారు. వంట వరకే పరిమితం కాని రాహుల్… పార్టీకి చెందిన తెలంగాణ నేతలు, గిరిజనులతో కలిసి బొంగు చికెన్ రుచి చూశారు. తాను వండిన బొంగు చికెన్ ను తానే అందరికీ వడ్డించి మరీ ఆయన తన ముచ్చట తీర్చుకున్నారు. ఈ అరుదైన ఘటనకు చెందిన వీడియోను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ (టీపీసీసీ) శనివారం సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఇటీవలే తెలంగాణను దాటుకుని మహారాష్ట్రలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తెలంగాణలో యాత్ర సాగుతున్న సమయంలో ఆయా ప్రాంతాలకు చెందిన సంస్కృతి, సంప్రదాయాల గురించి తెలుసుకునేందుకు రాహుల్ ఆసక్తి చూపారు. ఈ క్రమంలో యాత్ర ముగుస్తున్న సమయంలో టీపీసీసీ నేతలతో పాటు గిరిజనులతోనూ రాహుల్ గాంధీ పొలాల మధ్యన భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా తెలంగాళణలో తన యాత్ర సాగిన తీరు, నేతల నుంచి అందిన సహకారం తదితరాలపై రాహుల్ చర్చించారు. ఈ సమయంలోనే పొలాల మధ్య ముచ్చట్లకు ముందు గిరిజనులతో కలిసి రాహుల్ గాంధీ భొంగు చికెన్ వండారు. మసాలా దట్టించిన చికెన్ ను తన చేతిలోకి తీసుకున్న రాహుల్ గాంధీ…దానిని అప్పటికే సిద్ధం చేసిన బొంగుల్లో కూరారు. ఆ తర్వాత వాటిని మంటపై పెట్టి కాల్చారు. అలా మంటపై చికెన్ దట్టించిన బొంగులను పేర్చిన తర్వాత నేతలతో కలిసి పిచ్చాపాటిగా మాట్లాడిన రాహుల్ గాంధీ… బొంగు చికెన్ తయారైందన్న సమాచారం రాగానే… సమీక్షను ముగించారు. నేతలతో కలిసి బొంగుల్లో నుంచి చికెన్ ను బయటకు తీసిన రాహుల్…చికెన్ ను ప్లేట్లలో పెట్టి పార్టీ నేతలతో పాటు గిరిజనులకు స్వయంగా అందించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ.. బొంగు చికెన్ ను రుచి చూసి అద్భుతమని కూడా చెప్పారు. టీపీసీసీ విడుదల చేసిన ఈ వీడియో జనాన్ని ఆకట్టుకుంటోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement