Thursday, April 18, 2024

Big Story: పేదల ఇండ్ల క్రమబద్దీకరణ గడువు ముగింపు.. 31వ తేదీ లాస్ట్ డే!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: నిరుపేదల సంక్షేమంలో భాగంగా ప్రభుత్వ భూముల్లో ఇండ్లు నిర్మించుకున్న పేదలకు క్రమబద్దీకరణ గడువు నేటితో ముగినుంది. రష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు జీవో 58, 59ల కింద 1,47,268 దరఖాస్తులు ప్రభుత్వానికి చేరాయి. ఇందులో జీవో 58కింద 87250 దరఖాస్తులురాగా, జీవో 59కింద 59,748 దరకాస్తులు వచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది. 2014 జూన్‌ 2 నాటికి ఆక్రమణల్లో ఉన్నవారికే క్రమబద్దీకరణ అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఫిబ్రవరిలో ఉత్తర్వులు పొడిగించింది. ఇదే చివరి అవకాశంగా హెచ్చరించింది. ఈ మేరకు జీవో 14ను విడుదల చేసింది. ఈ గడువు నేటితో ముగుస్తోంది. అయితే ఈ దరఖాస్తుల స్వీకరణకు గ్రామాల్లో మీసేవలకు ఆప్షన్లు రాలేదని, అనేక సమస్యలు ఎదురైనట్లు తెలిసింది. పట్టణాలు, నగరాల్లోనే ఎక్కువగా క్రమబద్దీకరణకు స్పందన వచ్చినట్లు సమాచారం. అయితే రెవెన్యూ శాఖకు ఎటువంటి లాగిన్‌ సౌకర్యం కల్పించలేదని, మీ సేవల ద్వారా టీఎస్టీఎస్‌ మాత్రమే వీటిని స్వీకరించడంతో కొంత అయోమయం ఎదురైనట్లుగా తెలిసింది.

నిరుపేదల అభ్యున్నతికి ఎనలేని కృషి చేస్తున్న ప్రభుత్వం మరోసారి తనకుతానే సాటిగా నిరూపించుకున్నది. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా గూడులేని నిరుపేదలు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని ఇండ్లు నిర్మించుకున్న పేదల అభ్యున్నతికి పెద్దపీట వేస్తూ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా మరోసారి పేదల ఇండ్ల క్రమబద్దీకరణ జీవోలు 58, 59లను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత వీటి క్రమబద్దీకరణకు 2014 డిసెంబర్‌ 30న రాష్ట్ర ప్రభుత్వం రెండు జీవోలను జారీ చేసింది. వీటిని దశలవారీగా పలుమార్లు పొడిగిస్తూ పేదలకు అవకాశం కల్పించింది. జీవో 58 ప్రకారం 125 చదరపు గజాల్లోపు ప్రభుత్వ స్థలాల్లో ఇండ్లు నిర్మించుకున్న వారికి ఉచితంగా క్రమబద్దీకరించేందుకు ఆమోదించింది. జీవో 59 ప్రకారం మధ్యతరగతి, ఆపై తరగితికి చెందిన ప్రజలు నిర్మించుకున ఇండ్ల విస్తీర్ణం ఆధారంగా ధరలను ఖరారు చేసింది. 125 చదరపు గజాలనుంచి 250 చదరపు గజాల వరకు 2104 నాటి బేసిక్‌ మార్కెట్‌ విలువలో 50శాతం చెల్లిస్తే చాలని, 250 చదరపు గజాలనుంచి 500 చదరపు గజాల్లోపు వాటికి బేసిక్‌ మార్కెట్‌ విలువలో 75శాతం చెల్లించాలని, 500ల చదరపు గజాలకు మించిన స్థలాల్లో ఇండ్లు నిర్మించుకున్న వారికి 100శాతం మార్కెట్‌ విలువను వసూలు చేయాలని నిర్ణయించింది. ఇందుకు కిస్తీలుగా (దశలవారీగా) చెల్లింపులకు కూడా ప్రభుత్వం అవకాశాం కల్పించింది.

కాగా ఈ జీవోల గడువు 2022 ఫిబ్రవరి 21నుంచి మార్చి 31వరకు పొడిగిస్తూ చివరి అవకాశం కల్పించారు. ఇలా ఈ అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం 2014లో, 2015 జనవరి 30న, 2017 ఫిబ్రవరి 8న, 2017 డిసెంబర్‌ 18న పొడిగించుకుంటూ వచ్చింది. తాజాగా మరోసారి అర్హులు మీ సేవల్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. వీటి పరిష్కారానికి ఆర్డీవో నేతృత్వంలో తహశీల్దార్‌తో కూడిన కమిటీలకు ప్రభుత్వం అధికారం కట్టబెట్టింది. దరఖాస్తు అందిన 90 రోజుల్లో ఈ కమిటీ పరిశీలన చేసి సమస్యలను పరిష్కరించి కన్వేయన్స్‌ డీడ్‌ను మహిళ పేరుతో అందించాలని ప్రభుత్వం పేర్కొంది.
ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు అర్హులు తమ దరఖాస్తులతోపాటు ఆదార్‌ కార్డును, పొజిషన్లో ఉన్నట్లుగా ఆధారాన్ని, రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌, ఆస్తిపన్ను రశీదు, కరెంటు బిల్లు, నీటి బిల్లులను సమర్పించాల్సి ఉంటుంది. ఆక్రమిత నివాస స్థలాల క్రమబద్దీకరణతో పేదలకు అండగా నిల్వడంతోపాటు, సర్కార్‌కు రాబడి సమకూరనుందని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా పేదల సమస్య తీరనుందని అంచనా వేస్తోంది. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో మార్కెట్‌ విలువలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దరఖాస్తుదారులకు భారం కాకుండా దశలవారీ నగదు చెల్లింపులకు వెసులుబాటు కల్పించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో జీవో 59ద్వారా మార్కెట్‌ ధర చెల్లించి క్రమబద్దీకరణ చేయించుకునే అవకాశం వర్తింపజేసింది.

గతంలో 3.5లక్షల దరఖాస్తులురాగా ఇందులో 2లక్షల వరకు పరిష్కారమయ్యాయి. ప్రభుత్వ నిర్దేశిత రెండు వాయిదాల్లో ఫీజులను చెల్లింకపోవడం, తగిన ఆధారాలు సమర్పించనటువంటి 1.5 లక్షల దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టారు. వీటిలో ఏయే కారణాలతో ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయనే వివరాలను సేకరించి నివేదిక రూపొందించారు. వీటిపై మరోసారి అవకాశం ఇచ్చి పరిష్కరించేందుకు ఆమోదించారు. ఈ నేపథ్యంలో పెండింగ్‌లతోపాటు, కొత్త దరఖాస్తులకు మోక్షం కల్గనుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement