Thursday, April 25, 2024

నేటి నుంచి భట్టి పాదయాత్ర.. అమ్మపేటలో పీపుల్స్ మార్చ్ ప్రారంభం

ప్రజా సమస్యల పరిష్కారం కొరకై తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క మధిర నియోజకవర్గంలో చేపట్టిన పీపుల్స్ మార్చ్ (పాదయాత్ర) శుక్రవారం నుంచి పున ప్రారంభం కానుంది. ముదిగొండ మండలం అమ్మపేట గ్రామంలోని శ్రీ వెలుగొండ స్వామి సన్నిధి నుంచి భట్టి విక్రమార్క శుక్రవారం నుంచి తన పాదయాత్రను తిరిగి ప్రారంభిస్తారు. పీపుల్స్ మార్చ్  (పాదయాత్ర) ఫిబ్రవరి 27న ఆదివారం రోజు ముదిగొండ మండలం యడవల్లి నుంచి ప్రారంభమై ఈ నెల 5న గంధసిరి గ్రామం వరకు కొనసాగింది. సుమారు 102 కిలోమీటర్ల మేర కొనసాగిన పాదయాత్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 7 నుంచి 15 వరకు ఉండడంతో తాత్కాలికంగా వాయిదా పడిన విషయం విదితమే. అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడటంతో తిరిగి ప్రజాసమస్యల పరిష్కారం కొరకు మధిర నియోజకవర్గం లోని చింతకాని, బోనకల్లు, మధిర, ఎర్రుపాలెం మండలాల్లోని అన్ని గ్రామాల్లో కాలి నడక ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి భట్టి విక్రమార్క తన పాదయాత్రను శుక్రవారం నుంచి నిరవధికంగా కొనసాగించనున్నారు.

ఈ పాదయాత్ర విజయవంతం చేయడానికి ఇప్పటికే  అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని , కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దుర్గా ప్రసాద్ పీపుల్స్ మార్చ్ నియోజకవర్గ కన్వీనర్ బుల్లెట్ బాబు   పాదయాత్ర నిర్వహించే గ్రామాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించి కార్యకర్తలను సమాయత్తం చేశారు. పాదయాత్ర విజయవంతం కోసం వేసిన టువంటి అన్ని కమిటీలు చాలా చురుకుగా పని చేస్తూ వారికి అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు.  పాదయాత్ర జరిగే అన్ని గ్రామాల్లో సమస్యలను క్షేత్ర స్థాయి నాయకులు గుర్తించారు. ఆయా సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలను నేరుగా కలిసి వాటి పరిష్కారం కొరకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నిర్వహించే పాదయాత్రలో అడుగులో అడుగు వేసి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు నిర్వహించే ఈ పీపుల్స్ మార్చ్ లో కదలిరావాలని ప్రజలను సమాయత్తం చేస్తున్నారు. అదేవిధంగా పాదయాత్ర విజయవంతం చేయాలని కాంక్షిస్తూ కాంగ్రెస్ శ్రేణులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. వాల్ పెయింటింగ్, స్వాగతం పలికేందుకు ఫ్లెక్సీల ఏర్పాటు చేశారు. అదే విధంగా ప్రత్యేక ప్రచార రథాలను, రూట్ మ్యాప్ ను సిద్ధం చేశారు.

మరోవైపు నేడు ముదిగొండ మండలం అమ్మపేట గ్రామంలోని శ్రీ వెలుగొండ స్వామి సన్నిధి నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది. అదే రోజున వల్లాపురం మీదుగా చింతకాని మండలం నామవరం,  మత్కేపల్లి, జగన్నాధపురం గ్రామాల్లో కొనసాగుతుంది. జగన్నాధపురంలో బస చేస్తారు. ఈనెల 26న చింతకాని, నరసింహపురం, అంతసాగర్, పందిలపల్లి, బొప్పారం, గాంధీనగర్ గ్రామాల్లో పాదయాత్ర కొనసాగుతుంది. గాంధీనగర్ గ్రామంలో బస చేస్తారు. ఈ నెల 27న గాంధీ నగర్ నుంచి రామకృష్ణాపురం, బసవాపురం, కొదుమూరు గ్రామాల్లో పాదయాత్ర కొనసాగుతుంది కొదుమూరు గ్రామంలో బస చేస్తారు. ఈనెల 28న కొదుమూరు నుంచి వందనం, రాఘవపురం,  లచ్చగూడెం, నేరడ గ్రామాల్లో పాదయాత్ర కొనసాగుతుంది. నేరడ గ్రామంలో  బస చేస్తారు. ఈనెల 29న నేరడ నుంచి గంగమ్మ దేవాలయం, కోమట్ల గూడెం,  నాగలిగొండ, పొద్దుటూరు గ్రామాల్లో పాదయాత్ర కొనసాగుతుంది. పొద్దుటూరు గ్రామంలో బస చేస్తారు. 30న పొద్దుటూరు నుంచి తూటికుంట, రేపల్లె వాడ, పాతర్ల పాడు గ్రామాల్లో పాదయాత్ర కొనసాగుతుంది. పాతర్ల పాడు గ్రామంలో బస చేస్తారు. 31న పాతర్ల పాడు నుంచి వాయి రైల్వే కాలనీ, నాగులవంచ, సీతంపేట, చిన్న మండవ గ్రామాల్లో పాదయాత్ర కొనసాగుతుంది. చిన్న మండవ గ్రామంలో బస చేస్తారు. ఏప్రిల్ 1న చిన్న మండవ నుంచి తిమ్మినేనిపాలెం, తిరుమలాపురం నాగులవంచ గ్రామానికి చేరుకొని ని అదే గ్రామంలో బస చేస్తారు. ఇలా ఎనిమిది రోజులపాటు చింతకాని మండలంలో సుమారు 106 కి.మీ పాదయాత్ర చేసే విధంగా నిర్వాహకులు రూట్ మ్యాప్ సిద్ధం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement