Tuesday, April 23, 2024

తెలంగాణలో భారత్ జోడో యాత్ర..చిన్నారులతో రాహుల్ గాంధీ రన్నింగ్..ఆయనవెంట పరిగెత్తిన రేవంత్ రెడ్డి

తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రారంభించిన భారత్ జోడోయాత్ర కొనసాగుతోంది. రాష్ట్రంలో ఐదో రోజు పాద యాత్రలో భాగంగా ఆదివారం జడ్బర్లలో రాహుల్ పాదయాత్రను కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ నాయకులందరినీ ఉత్తేజ పరిచారు. యాత్రలో నడుస్తున్న రాహుల్ వద్దకు కొంతమంది చిన్నారులు వచ్చారు. ఇంతలో మనం పరుగెత్తుదామా.. రెడీ వన్ టు త్రీ అంటూ రాహుల్ రన్నింగ్ మొదలు పెట్టారు. రాహుల్ ను చూసి పక్కనే ఉన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా పరుగు అందుకున్నారు. మిగతా నాయకులు, భద్రతా సిబ్బంది కూడా పరుగెత్తారు. అలా కొద్దిదూరం వెళ్లిన తర్వాత పరుగు ఆపిన రాహుల్ మళ్లీ నడవడం కొనసాగించారు. రాహుల్ పరుగెత్తడం చూసి అక్కడున్నవాళ్లంతా కేరింతలు కొట్టారు. ఈ రోజు రాహుల్ 22 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సాయంత్రం గాంధీ షాద్‌నగర్‌లోని సోలిపూర్ జంక్షన్ వద్ద సభలో పాల్గొంటారు. నవంబర్ ఏడో తేదీ వరకు తెలంగాణలో రాహుల్ పాదయాత్ర కొనసాగుతోంది. రాష్ట్రంలో మొత్తం 375 కి.మీ నడుస్తూ 19 అసెంబ్లీ, 7 పార్లమెంట్ నియోజకవర్గాలను రాహు కవర్ చేయనున్నారు. నవంబర్ 4న యాత్రకు ఒకరోజు విరామం ఇస్తారు. రాష్ట్రంలో పాదయాత్ర జరిగే సమయంలో రాహుల్ గాంధీ క్రీడా, వ్యాపార, సినీ రంగాలకు చెందిన ప్రముఖులతో సహా మేధావులు, వివిధ సంఘాల నాయకులతో సమావేశమవుతారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement