Saturday, April 20, 2024

కరోనాపై మరింత కేర్​గా ఉండాలే.. కలెక్టర్లలతో కేబినెట్ సబ్ క‌మిటీ వీడియో కాన్ఫరెన్స్..

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు డిసెంబర్ నెలాఖరుకు కొవిడ్ వ్యాక్సినేషన్ రెండు డోసులను 100 శాతం సాధించుటకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని జిల్లా కలెక్టర్లకు కరోనా కట్టడి, వ్యాక్సినేషన్ పై ప్రభుత్వం నియమించిన కేబినెట్ సబ్ కమిటీ ఆదేశాలు జారీచేసింది. పంచాయతీ , మున్సిపల్, విద్య, ఆరోగ్యం సహా అన్ని శాఖలు సమన్వయం చేసుకుంటూ లక్ష్యాన్ని చేరాలని మార్గనిర్దేశం చేసింది. బుధవారం బి.ఆర్.కె.ఆర్. భవన్ నుండి కొవిడ్ వ్యాక్సినేషన్ తో పాటు ఒమిక్రాన్ వేరియంట్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్లు, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు , ఇతర శాఖల అధికారులతో మంత్రి హ‌రీశ్‌రావు అధ్య‌క్ష‌త‌న వీడియో కాన్ఫ‌రెన్స్ జ‌రిగింది. ఈ వీడియో కాన్ఫ‌రెన్స్‌లో మంత్రులు కె.టి.రామారావు, సబితా ఇంద్రా రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. ఇటీవల జరిగినకేబినెట్ సమావేశంలో ఒమిక్రాన్ వేరియంట్, వ్యాక్సినేషన్ పై జిల్లాల వారీగా ముఖ్యమంత్రి సమగ్రంగా చర్చించినట్లు తెలిపారు.  ఒమ‌క్రాన్ ను అరికట్టుటకు వ్యాక్సిన్ తో పాటు, ప్రజలు తప్పని సరిగా మాస్క్ దరించడం, కొవిడ్ నిబందనలను పాటించడమే ఏకైక మార్గం అని తెలిపారు. వాక్సినేషన్ ప్రక్రియలో దేశంలోని అనేక ఇతర రాష్ట్రాల కన్నా తెలంగాణ ముందువరుసలో ఉందని ఈ సందర్భంగా మంత్రులు తెలిపారు. రాష్ట్ర పంచాయతీ రాజ్ , పురపాలక శాఖల సంపూర్ణ సహకారం తో  వ్యాక్సినేషన్ ను వేగంగా ముందుకు తీసుకుపోతున్నట్లు తెలిపారు.  ప్రభుత్వ శాఖల సమన్వయంతో డిసెంబర్ నాటికి 100 శాతం వ్యాక్సినేషన్ లక్ష్యాలను సాధించుటకు ఆవాసాలు , వార్డులు , సబ్ సెంటర్లు, మున్సిపాలిటీలు , మండలాలు వారీగా యాక్షన్ ప్లాన్  రూపొందించాలని జిల్లా కలెక్టర్లుకు సూచించారు.

వైద్య, ఆరోగ్య శాఖలో క్షేత్రస్థాయి లో వసతులు అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్ రావు తెలిపారు. అందులో భాగంగా ఏరియా ఆసుపత్రుల అప్ గ్రేడేషన్ , రేడియాలజీ ల్యాబ్ లు , పాధాలజీ ల్యాబ్ , ఆర్.టి.పి.సి.ఆర్ సెంటర్లు ఏర్పాటుకు అనువైన వసతులు, స్థలాలు కేటాయించాలని , కొత్త మెడికల్ కళాశాలల భవనాల నిర్మాణం , అనుబంధ ఆసుపత్రులలో అదనపు పడకల ఏర్పాటు పనులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ అంశాలపై సంబంధిత అధికారులతో వెంటనే చర్చించాలని సూచించారు.

రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.టి.రామా రావు మాట్లాడుతూ.. రెండు విడతల కొవిడ్ పై ఏర్పడిన పరిస్థితులపై అందరికి అవగహన ఉన్నదని తెలిపారు. సోషల్ మీడియా లో జరిగే తప్పుడు ప్రచారాల పట్ల అప్రమత్తంగా వ్యహరించాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నుంచి రెగ్యులర్ గా వచ్చే సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రచార మాద్యమాల ద్వారా ప్రజలకు చేరవేసి ప్రజలను చైతన్యవంతం చేయాలన్నారు.  కరోనాపై వచ్చే  పుకార్లతో ప్రజలలో గందరగోళం నెలకొంటుందని, ప్రజలకు సరైన సమాచారాన్ని, సూచనలను ఎప్పటికప్పుడు అందించడమే ఇందుకు పరిష్కార మార్గమని తెలిపారు.

ఒమిక్రాన్ వేరియంట్ వలన ఇప్పుడే ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కరోనా నియంత్రణ చర్యలను పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర స్థాయి తో పాటు జిల్లాలలో అందుబాటులో ఉన్న ఆసుపత్రుల బెడ్స్ పై ప్రజలకు సమాచారాన్ని అందించాలని తెలిపారు. ప్రజలకు సరైన సమాచారాన్ని , సూచనలను అందించుటకు రాష్ట్ర స్థాయిలో గతంలో నెలకోల్పిన కమాండ్ కంట్రోల్ సెంటర్ ను తిరిగి యాక్టివేట్ చేయించి , 24/7 పద్దతిలో పనిచేయించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు మిషన్ మోడ్ లో పనిచేయుటకు ప్రణాళికను రూపొందించుకోవాలని జిల్లా కలెక్టర్లకు మంత్రి కె.టి.రామారావు సూచించారు.

- Advertisement -

ఈ సందర్భంగా రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి మాట్లాడుతూ పాఠశాలలు, కళాశాలలు , వసతి గృహలలో కోవిడ్ నివారణకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అవసరమైన చోట విద్య సంస్థలలో వ్యాక్సినేషన్ శిబిరాలు ఏర్పాటు చేసి 100 శాతం లక్ష్యాలను సాధించాలని అధికారులకు సూచించారు. పాఠశాలలలో పనిచేస్తున్న టీచింగ్ , నాన్ టీచింగ్ స్టాప్ లో 90 శాతం వ్యాక్సినేషన్ జరిగినట్లు తెలిపారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి  శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా , ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వీ, విద్య శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్, పురపాలక శాఖ కమీషనర్ / డైరెక్టర్ సత్యనారాయణ, జి.హెచ్.యం.సి కమీషనర్ లోకేశ్ కుమార్ , ఇంటర్ బోర్డు  కార్యదర్శి ఒమర్ జలీల్ , పంచాయతీ రాజ్ కమీషనర్ ఎ.శరత్, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డా.జి.శ్రీనివాస్ రావు, డి.యం.ఈ డా.రమేశ్ రెడ్డి, సి.యం. ఓ.యస్.డి. డా.గంగాదర్  తదితర అధికారులు వీడియో కాన్ఫరెన్స్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement