Thursday, March 28, 2024

డ్యూటీ చేస్తున్న బ్యాంకుకే టోకరా.. కడుపునొప్పి పేరుతో క్యాష్​ దొబ్బేసిన క్యాషియర్‌

ఎల్బీనగర్‌, ప్రభన్యూస్‌: హైదరాబాద్​లోని వనస్థలిపురం రైతుబజార్‌ వద్దగల బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా సాహెబ్‌నగర్‌ బ్రాంచ్‌లో మంగళవారం 22,53,378 లక్షల నగదు మాయమైంది. విధులు నిర్వహిస్తున్న క్యాషియర్‌ ప్రవీణ్‌కుమార్‌ కడుపునొప్పి సాకుతో వెళ్లి కనిపించకపోవడంతో కంగుతిన్న బ్రాంచ్‌ మేనేజర్‌ వినయ్‌కుమార్‌ వనస్థలిపురం పోలీసులను ఆశ్రయించాడు. సాహెబ్‌నగర్‌ బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా శాఖలో ప్రవీణ్‌కుమార్‌ క్యాషియర్‌గా సంవత్సర కాలం నుండి పనిచేస్తున్నాడు. రోజువారి లాగే మంగళవారం విధులకు హాజరయ్యారు.

మధ్యాహ్నం సమయంలో కడుపునొప్పి వస్తోందని టాబ్లెట్‌ తెచ్చుకుంటానని బ్రాంచ్‌ మేనేజర్‌ వినయ్‌ కుమార్‌కు చెప్పి వెళ్లిపోయాడు. ఎంతకూ తిరిగి రాకపోవడంతో మేనేజర్‌ ఫోన్‌ చేయగా స్విచ్‌ఆఫ్‌ వచ్చింది. బ్యాంకు క్లోజ్‌ చేసే సమయం కావడంతో నగదును లెక్కించారు. అందులో రూ. 22,53,378 లక్షల రూపాయల నగదు లేదు. దీంతో బ్యాంకు మేనేజర్‌ వనస్థలిపురం పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బ్యాంకు సిబ్బందిని విచారించి సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement