Thursday, March 28, 2024

Farm House Deal: బండి సంజ‌య్ బంధువుకు ఫామ్​హౌస్​ డీల్స్​ లింక్‌.. నిర్ధారించుకున్న ‘సిట్‌’ అధికారులు

తెలంగాణలో రాజకీయ దుమారానికి కారణమైన ఫామ్ హౌస్ డీల్స్‌.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ట్రై చేసిన‌ నిందితులకు బీజేపీతో లింక్ ఉంద‌ని, బీజేపీ ప్లాన్ లో భాగంగానే నిందితులు హైదరాబాద్ వచ్చార‌ని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ సర్కారు ఈ కేసు విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో విచారణ చేయిస్తుండగా… హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ నేతృత్వంలోని సిట్ శనివారమే ఈ కేసు దర్యాప్తును మొదలుపెట్టింది.

ఇక‌.. సిట్ అధికారులు తొలి రోజే ఓ కీలక విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు యత్నించిన ముగ్గురు నిందితుల్లో ఒకరైన సింహయాజీకి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ బంధువు ఫ్లైట్ టికెట్లను సమకూర్చారని సిట్ తేల్చింది. సింహయాజీకి విమాన టికెట్లు సమకూర్చిన సదరు వ్యక్తి బండి సంజయ్ కు దగ్గరి బంధువని, ఆయన కరీంనగర్ లో న్యాయవాదిగా పనిచేస్తున్నట్లు సిట్ నిర్ధారించుకుంది. అయితే ఆయన పేరును మాత్రం సిట్ వెల్లడించలేదు.

ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు యత్నించిన నిందితులు గత నెల 26న తిరుపతి నుంచి హైదరాబాద్ రాగా… వారిలో సింహయాజీకి బండి సంజయ్ బంధువు విమాన టికెట్లను సమకూర్చిన‌ట్టు సిట్ ద్వారా తెలుస్తోంది. అంతేకాకుండా ఈ కేసులోని మరో నిందితుడు నందకుమార్ తో కూడా సదరు న్యాయవాది గత నెల 14న ఫోన్ లో మాట్లాడినట్లు సిట్ నిర్ధారించుకుంది. ఇదిలా ఉంటే… ఈ కేసులో బాధితులుగా ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గుజరాత్, ఉత్తర ప్రదేశ్ ల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నట్లుగా టీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement