Thursday, April 25, 2024

ఉచిత స్టడీ సర్కిల్‌.. సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ లేఖ

సీఎం కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాశారు. ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ యువతీ యువకులకు అసెంబ్లీ నియోజకవర్గానికొక స్టడీ సర్కిల్‌ ఏర్పాటు చేయాలని కోరారు. గత రెండేండ్లుగా కోవిడ్‌ మహమ్మారి వల్ల తలెత్తిన ఆర్థిక ఇబ్బందుల వల్ల యువతీ, యువకులు పోటీపరీక్షల కోసం పెద్ద ఎత్తున ఖర్చుపెట్టే పరిస్థితి లేదని పేర్కొన్నారు. మారుమూల గ్రామాల నుంచి శిక్షణ కొరకు జిల్లా కేంద్రాలకు రావడం నిరుద్యోగ యువతకు వ్యయ ప్రయాసలతో కూడిన అంశం అని అన్నారు. కాబట్టి నియోజకవర్గానికొక ఉచిత స్టడీ సర్కిల్‌ను ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు అదనపు ఖర్చులు తగ్గించాలని తెలిపారు. ఈ కోచింగ్‌ కేంద్రాలలో శిక్షణ పొందే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వమే ఉచితంగా అల్పాహారం, భోజన సౌకర్యాలు కల్పించాలన్నారు. అలాగే, ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని తెలిపారు. ప్రైవేట్‌ కోచింగ్‌ సెంటర్లలో ఫీజుల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసి ఫీజులు నియంత్రించాలని డిమాండ్ చేశారు. పార్టీల ద్వారా ఏర్పాటు చేసే కోచింగ్‌ సెంటర్ల వల్ల అభ్యర్థుల్లో రాగద్వేషాలు ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో టీశాట్‌, ప్రభుత్వ స్టడీ సర్కిల్స్‌, కోచింగ్‌ కేంద్రాల ద్వారానే నిరుద్యోగ యువతకు శిక్షణనివ్వాలని సూచించారు. అలాగే, ప్రతి జిల్లా, నియోజకవర్గ కేంద్రాలలో గ్రంథాలయాలను ఏర్పాటు చేయాలని, నిరుద్యోగ యువతకు అవసరమైన కోచింగ్‌ మెటీరియల్‌ ఉచితంగా అందించాలన్నారు. అదేవిధంగా వెంటనే టెట్‌ ఎంట్రన్స్‌ పరీక్ష నిర్వహించాలని బండి సంజయ్ లేఖలో డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement