Wednesday, April 17, 2024

తెలంగాణ కేబినెట్‌లో ప్రజలకు ఉపయోగపడే నిర్ణయమేది?: బండి సంజయ్

కేసీఆర్ ప్రభుత్వంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి విరుచుకుపడ్డారు. హుజురాబాద్ ఎన్నికల పుణ్యమా అని రెండు రోజుల పాటు కేబినెట్ మీటింగ్‌ను కేసీఆర్ నిర్వహించినా.. ప్రజలకు ఉపయోగపడే ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదని ఆరోపించారు. ఏడేళ్ల తర్వాత నిద్రలేచి కేసీఆర్ ఇప్పుడు ఫుడ్ ప్రాసెస్సింగ్ యూనిట్ల గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. 2014లోనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో నిజామాబాద్, మహబూబ్ నగర్, ఖమ్మంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను మంజూరు చేసిందని.. వీటికి 50 శాతం సబ్సిడీ కూడా కేంద్రమే భరిస్తుందని ప్రకటించినట్లు గుర్తుచేశారు.

అయితే ఇన్నాళ్లు ఈ అవకాశాన్ని కేసీఆర్ సర్కారు సద్వినియోగం చేసుకోలేదని బండి సంజయ్ అన్నారు. 7 ఏళ్ల తర్వాత నిద్ర లేచి కేసీఆర్ ఇపుడు హడావుడి చేస్తున్నారని.. కేవలం ఎన్నికల కోసం ప్రకటన లాగా కనిపిస్తోందన్నారు. దేవుడి దయతో వర్షాలు సమృద్ధిగా కురిసి కొద్దిగా పంట దిగుబడి పెరిగితే అదేదో తన ఘనతగా కేసీఆర్ చేప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కేంద్ర సంస్థలు ఇచ్చేనిధులతో చేసే ధాన్యం కొనుగోలులో కూడా ఈ ప్రభుత్వం విఫలమైందన్నారు. ధాన్యం తడిసి రైతులు బాగా నష్ట పోయారని, ఇంకా అందరికి రుణ మాఫీ కాలేదని, ఈ సర్కారు దగ్గర రైతుల కోసం క్రెడిట్ ప్లాన్ లేనే లేదని ఆరోపించారు. రైతులకు బ్యాంక్ లోన్ ఇప్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతు బంధు డబ్బులను బ్యాంకులు వడ్డీలో మినహాయించుకుంటున్నారని విమర్శించారు. ప్రత్యామ్నాయ పంట సాగులో రైతులకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరువైందన్నారు. కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేసే ప్రకటనలు తప్ప వాటిని అమలు చేసే అవకాశం కనిపించడం లేదని బండి సంజయ్ విమర్శలు చేశారు.

ఈ వార్త కూడా చదవండి: భూమి కోసం ఎమ్మార్వో కాళ్లపై పడిన మహిళ

Advertisement

తాజా వార్తలు

Advertisement