నడి రోడ్డు మీద బిజెపి నాయకుడిని పలువురు దుండగులు హత్య చేయడం కలకలం రేపింది. కాగా మృతి చెందిన నాయకుడిని ఎస్సీ/ఎస్టీ విభాగం సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు బాలచంద్రన్గా గుర్తించారు. అయితే తనకు ప్రాణహాని ఉందని గతంలోనే అతడు అధికారులకు తెలియజేశారు. దీంతో ఆయనకు పోలీసులు పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ ను కూడా అందించారు. ఈ కేసులో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడు బీజేపీ SC/ST విభాగం కేంద్ర జిల్లా అధ్యక్షుడు బాలచంద్రన్ చెన్నైలోని చింతాద్రిపేట ప్రాంతంలోని ఒక వీధిలో కొంతమంది వ్యక్తులతో మాట్లాడుతున్నారు. అయితే అదే సమయంలో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు బైక్ పై వచ్చి దారుణంగా పొడిచారు. దీంతో అతడు ప్రాణాలు వదిలేశాడు. అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. అతడి ప్రాణాలను కాపాడేందుకు నియమించిన భద్రతా అధికారి టీ తాగేందుకు వెళ్లిన సమయంలో ఇది చోటు చేసుకుంది.
బాలచంద్రన్ మృతిపై చెన్నై పోలీస్ కమిషనర్ శంకర్ జీవల్ మాట్లాడుతూ.. ‘‘ఇది పాత శత్రుత్వంతో జరిగిన హత్య కేసు. ఘటనపై ప్రత్యక్ష సాక్షులతో కూడా మాట్లాడాం. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని కమిషనర్ తెలిపారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు ఘటనాస్థలికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలను సేకరించారు. అలాగే పాత శత్రుత్వం, ప్రత్యక్ష సాక్షుల ఆధారంగా ప్రదీప్, సంజయ్, కలైవానన్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ హత్యపై తమిళనాడు ప్రతిపక్ష నేత (ఏఐడీఎంకే) కే పళనిస్వామి రాష్ట్ర పోలీసులను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు రాశారు. “ గత 20 రోజుల్లో 18 హత్యలు జరిగినట్లు నివేదికలు వచ్చాయి. ఇలాంటి ఘటనలు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ రాజధానిని ఘోరమైన నగరంగా మార్చేశాయి. అదే సమయంలో ప్రజల భద్రతపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయని ట్వీట్ చేశారు.